MLC Kavitha: ఆయన వల్లే వారి జీవితాల్లో వెలుగులు

ABN , First Publish Date - 2023-03-19T19:21:34+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ(Telangana) రాష్ట్రంలో...

MLC Kavitha: ఆయన వల్లే వారి జీవితాల్లో వెలుగులు
BRS MLC Kavitha

హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఉద్యోగులకు తెలంగాణ(Telangana) రాష్ట్రంలో అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమ‌లుకు ఉత్తర్వులు జారీ చేసినందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో 3,978 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఏప్రిల్ 1 వ తేదీ నుండి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. సెర్ప్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి, ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో ఉన్నారు.

b461bae2-4cc9-4d21-8159-899e09cacca1.jpg

మరోవైపు కవిత ఈ సాయంత్రం ఢిల్లీ(Delhi) వెళ్లారు. కవిత వెంట మంత్రి కేటీఆర్(KTR), ఎంపీ సంతోష్(Santosh) తదితరులు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam Case)కు సంబంధించి ఆమె సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ED) విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న మిగతా నిందితులతో కలిపి కవితను విచారించనున్నారు. కేసులో కవితను అనుమానితురాలిగా ఇప్పటికే ఈడీ స్పష్టం చేసింది. అందుకే సుప్రీంకోర్టులోనూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అంతకు ముందే కవిత సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. కేసులో నిందితులకు ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి సాయంత్రం 6 తర్వాత కూడా విచారిస్తున్నారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే కవిత పిటిషన్‌పై ఈ నెల 24నే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ నెల 11న కవిత తొలిసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ నెల 16న ఆమె తిరిగి హస్తినకు వెళ్లారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ నెల 20న విచారణకు హాజరౌతానని చెప్పడంతో ఈడీ అందుకు అనుమతిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-03-19T19:56:56+05:30 IST