Share News

IND vs NZ: సెమీస్ పోరుకు ముందు ఎవరి బలమెంత? ఎవరి బలహీనతలేంటి.. టేబుల్‌పై రెండు జట్లు ఎలా ఉన్నాయంటే..?

ABN , First Publish Date - 2023-11-15T11:26:32+05:30 IST

India vs New zealand Semi-Final: భారత్, న్యూజిలాండ్ సెమీస్ సమరానికి అంతా సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో రెండు జట్ల మధ్య భీకరపోరు ప్రారంభంకానుది. గెలుపుపై టీమిండియా అభిమానులు ఎంత ధీమాగా ఉన్నప్పటికీ ఏదో భయం మనసును కలచివేస్తోంది. నాకౌట్ దశలో కివీస్ చేతిలో గతంలో ఎదురైన ఓటమినే ఈ ఆందోళనకు కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో లీగ్ దశలో అన్ని జట్లను చిత్తు చేసిన టీమిండియా నాకౌట్ పోరులో కివీస్ చేతిలో తుస్సుమంది.

IND vs NZ: సెమీస్ పోరుకు ముందు ఎవరి బలమెంత? ఎవరి బలహీనతలేంటి.. టేబుల్‌పై రెండు జట్లు ఎలా ఉన్నాయంటే..?

ముంబై: భారత్, న్యూజిలాండ్ సెమీస్ సమరానికి అంతా సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో రెండు జట్ల మధ్య భీకరపోరు ప్రారంభంకానుది. గెలుపుపై టీమిండియా అభిమానులు ఎంత ధీమాగా ఉన్నప్పటికీ ఏదో భయం మనసును కలచివేస్తోంది. నాకౌట్ దశలో కివీస్ చేతిలో గతంలో ఎదురైన ఓటమినే ఈ ఆందోళనకు కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో లీగ్ దశలో అన్ని జట్లను చిత్తు చేసిన టీమిండియా నాకౌట్ పోరులో కివీస్ చేతిలో తుస్సుమంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇదే జరిగింది. అంతేందుకు గత 20 ఏళ్లలో ఐసీసీ టోర్నీల్లో మన జట్టు కివీస్‌పై ఒకే ఒకసారి గెలిచింది. అది కూడా ఈ ప్రపంచకప్ లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లోనే.. అందుకే కివీస్‌తో పోరు అంటే మనసులో భయం అలుకుముంది. కానీ ఈ సారి మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం ఇంతకుముందున్న టీమిండియాకు ఇప్పుడున్న టీమిండియాకు చాలా తేడా ఉంది. అప్పట్లో టీమిండియా ఎంత బాగా ఆడినప్పటికీ జట్టులో ఏదో ఒక సమస్య ఉండేది. కానీ ప్రస్తుతం అలా లేదు. అన్ని విభాగాల్లో టీమిండియా బలంగా ఉంది.


మ్యాచ్‌కు ముందు భారత్, న్యూజిలాండ్ బలబలాలను ఒకసారి పరిశీలిస్తే.. బ్యాటింగ్‌లో రెండు జట్లలో మంచి స్టార్లున్నారు. ముందుగా టీమిండియా విషయానికొస్తే రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో మన ఓపెనింగ్ బాగుంది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే 500కు పైగా రన్స్ కొట్టాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో దుమ్ములేపుతున్నాడు. హిట్‌మ్యాన్ పవర్ ప్లే అంతా ఆడి మంచి ఆరంభం ఇస్తే బ్యాటింగ్‌లో జట్టుకు తిరుగుండదు. అదే సమయంలో కివీస్ ఓపెనర్లను పరిశీలిస్తే డేవాన్ కాన్వే అంతగా ఫామ్‌లో లేడు. ఆరంభలో రాణించిన ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. కానీ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. రచిన్‌ను త్వరగా ఔట్ చేయకపోతే మనకు కష్టాలు తప్పవు. ఇక రెండు జట్లలో మూడో స్థానం అత్యంత కీలకం. టీమిండియా తరపును మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. న్యూజిలాండ్ తరఫున మూడో స్థానంలో కేన్ విలియమ్సన్ ఆడనున్నాడు. వీరిద్దరు రెండు జట్లలో అత్యంత కీలకం. ఇద్దరూ ఒంటి చేతితో మ్యాచ్‌ను గెలిపించగలరు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో కూడా ఉన్నారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ టాప్‌లో ఉండగా.. గాయం నుంచి కోలుకుని వచ్చినప్పటికీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విలియమ్సన్ రెండు భారీ హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక మిడిలార్డర్ విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాతో మన మిడిలార్డర్ బలంగా ఉంది. అది ఎంతలా అంటే గతంలో ఎప్పుడు కూడా మన మిడిలార్డర్ ఇంత బలంగా కనిపించలేదు. ఈ టోర్నీలో 3 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే 400కు పరుగులు చేశాడు. ఓ సెంచరీ, ఓ భారీ హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా వీరిద్దరు కీలక సమయంలో జట్టును ఆదుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్‌ ఆడకపోయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లో విలువైన పరుగులు చేశాడు. పైగా అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఎక్కువగా రాలేదు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కివీస్‌తో లీగ్ దశలో ముగిసిన మ్యాచ్‌లో చివరి వరకు ఆడి విన్నింగ్ రన్స్ కొట్టాడు. మొత్తంగా మన బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అదే సమయంలో కివీస్ మిడిలార్డర్ అంత బలంగా లేదు. ఆ జట్టు మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్ మినహా మిగతా వారెవరూ ఫామ్‌లో లేరు. గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మార్క్ చాప్‌మన్ బ్యాటింగ్‌లో అంతగా రాణించడం లేదు.

ఇక బౌలింగ్ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌తో మన పేస్ బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. బుమ్రా ఇప్పటివకే 17 వికెట్లు తీశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో బుమ్రా పరుగులను కట్టడి చేస్తున్నాడు. ఇక షమీ ఆడిన 4 మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ కూడా చెలరేగుతున్నాడు. అదే సమయంలో కివీస్ పేస్ బౌలింగ్ యూనిట్‌లో ఆ జట్టు సీనియర్ పేసర్లు టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ రాణించలేకపోతున్నారు. గత టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌల్ట్ ఈ సారి మాత్రం ఆ ప్రదర్శన పునరావృతం చేయలేకపోతున్నాడు. అయితే ఫెర్గ్యూసన్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక స్పిన్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో మన బౌలింగ్ బలంగా ఉంది. కివీస్ టాప్ 8లో ఐదుగురు ఎడమ చేతి బ్యాటర్లున్నారు. కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్లైనా కుల్దీప్, జడేజాతో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కుల్దీప్, జడేజాకు తోడు పరిస్థితులకు అనుగుణంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ కూడా బౌలింగ్ చేయగలరు. గత మ్యాచ్‌లో అయితే రోహిత్, కోహ్లీ వికెట్లు కూడా తీశారు. భారత్‌లో పోలిస్తే కివీస్ స్పిన్ యూనిట్ బలహీనంగా ఉంది. ఐపీఎల్ సత్తా చాటే మిచెట్ శాంట్నర్ ప్రపంచకప్‌లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అతనికి తోడుగా ఉన్న పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఫిలిప్స్, రచీన్ రవీంద్ర కూడా అంతంతమాత్రంగానే బౌలింగ్ చేస్తున్నారు. ఇక ఫీల్డింగ్‌లో రెండు జట్లు బలంగా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే కివీస్‌తో పోలిస్తే టీమిండియా అన్ని విధాలుగా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మన ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. దీంతో టీమిండియా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. పైగా అభిమానుల మద్దతు కూడా ఉండనుంది. ఒత్తిడిని అధిగమిస్తే మన జట్టు గెలవడం పెద్దగా కష్టంకాదు. పైగా నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ కన్నా కివీస్‌కే చెత్త రికార్డు ఎక్కువగా ఉంది. టీమిండియా ఇప్పటివరకు ఆడిన 7 సెమీస్ మ్యాచ్‌ల్లో 3 గెలిస్తే.. న్యూజిలాండ్ 8 ఆడి 2 మాత్రమే గెలిచింది. చివరగా మొదటి సెమీస్‌లో గెలవడానికి న్యూజిలాండ్‌ కన్నా భారత్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి.

Updated Date - 2023-11-15T11:26:33+05:30 IST