Share News

World cup: ‘నిబంధనలు పాటించమని చెప్పింది ఇతడేనా’.. పాత వీడియోను షేర్ చేసి షకీబ్‌పై భగ్గుమంటున్న సోషల్ మీడియా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

ABN , First Publish Date - 2023-11-08T13:10:12+05:30 IST

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో వివాదానికి తెరదీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ‘టైమ్‌డ్ ఔట్’ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

World cup: ‘నిబంధనలు పాటించమని చెప్పింది ఇతడేనా’.. పాత వీడియోను షేర్ చేసి షకీబ్‌పై భగ్గుమంటున్న సోషల్ మీడియా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

ఢిల్లీ: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో వివాదానికి తెరదీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ‘టైమ్‌డ్ ఔట్’ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ టైమ్‌డ్ ఔట్ కావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. మాథ్యూస్ క్రీజులోకి వచ్చాక హెల్మెట్ విషయంలో సమస్య రావడం, అతను మరో హెల్మెట్ కోసం ప్రయత్నించడంతో కాస్త ఆలస్యమైంది. దీంతో క్రికెట్‌లోని నిబంధలను ఉపయోగించుకున్న బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ రివ్యూకు వెళ్లాడు. బ్యాటింగ్‌కు రావడం ఆలస్యం చేసిన కారణంగా మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాలని అంపైర్లను కోరాడు. ఈ విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్‌ షకీబ్ అల్ హసన్‌ను మాథ్యూస్ వేడుకున్న అతను వెనక్కి తగ్గలేదు. పైగా నిబంధనలు ప్రకారం ఆడాలని, అంపైర్ నిర్ణయాన్ని గౌరవించాలని మాథ్యూస్‌కు సూచించాడు. ఇక మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయం పెద్ద దుమారమే లేపింది. నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక బ్యాటర్ ఔటయ్యాక మరో బ్యాటర్ మూడు నిమిషాల్లోపు క్రీజులోకి రావాల్సి ఉంటుంది. లేదంటే ఔట్‌గా ప్రకటించవచ్చు. ఈ ప్రపంచకప్‌లో దానిని రెండు నిమిషాలకు తగ్గించారు.


అయితే ఈ విషయంలో మెజారిటీ క్రికెట్ అభిమానులు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను తప్పుబడుతున్నారు. ముఖ్యంగా అతను క్రికెట్ నిబంధనలు పాటించాలని మాథ్యూస్‌కు చెప్పాడని నెటిజన్లు హేళన చేస్తున్నారు. ముందుగా షకీబ్ క్రికెట్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. షకీబ్‌పై ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో షకీబ్ గతంలో మైదానంలో అంపైర్లతో దురుసుగా ప్రవర్తించిన ఓ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు. దానికి ‘‘నిబంధనల ప్రకారం ఆడాలని, అంపైర్ నిర్ణయాన్ని గౌరవించమని కోరిన వ్యక్తి ఇతనేనా?’’ అని క్యాప్షన్‌ పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అసలు ఆ వీడియో కథేంటంటే.. 2021లో ఢాకా ప్రీమియర్ లీగ్ జరిగింది. ఈ లీగ్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌, అబాహానీ లిమిటెడ్‌ జట్లు తలపడ్డాయి. ఈ లీగ్‌లో మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు షకీబ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అబాహానీ లిమిటెడ్ జట్టు బ్యాటర్ ముష్కియర్ రహీమ్ బ్యాటింగ్ సమయంలో అతను లెగ్‌బైస్‌లో ఔట్ అయినట్టుగా మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ అప్పీల్ చేసింది. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన షకీబ్ స్టంప్స్‌ను తన్నాడు. కాపేసటి తర్వాత వర్షం ప్రారంభంకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వెంటనే పిచ్‌ను కప్పడానికి కవర్లను తీసుకురావాల్సిందిగా గ్రౌండ్ సిబ్బందికి చెప్పారు. దీనికి కూడా తీవ్ర అసహనానికి గురైన షకీబ్ ఈ సారి మరింత రెచ్చిపోయాడు. ఏకంగా అంపైర్లు చూస్తుండగానే స్టంప్స్‌ను పీకేసి నెలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. షకీబ్ తీరు అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా అతనిపై చర్యలు తీసుకుంది.

తాజాగా ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన నెటిజన్లు “అంపైర్ నిర్ణయాన్ని గౌరవించమని, నిబంధనల ప్రకారం ఆడమని మాథ్యూస్‌ను కోరిన వ్యక్తి ఇతడేనా?” అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిజానికి షకీబ్‌కు వివాదాలు కొత్తేం కాదు. గతంలోనూ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. దీంతో అందరితో విమర్శలను ఎదుర్కొవలసి వచ్చింది. ఇటు తాజాగా మాథ్యూస్ వివాదంపై కూడా అందరూ షకీ‌బ్‌ను తప్పుబడుతున్నారు. షకీబ్ క్రీడా స్పూర్తి ప్రదర్శించడం నేర్చుకోవాలని హితవు పలువుకుతున్నారు. మరోవైపు తన ఔట్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాథ్యూస్ అసలు తాను బ్యాటింగ్ చేయడానికి 2 నిమిషాల సమయం దాటనేలేదని అంటున్నాడు. అందుకు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నాడు. తాను వాటిని బయటపెడతానని, ఐసీసీకి ఫిర్యాడు చేస్తానని తెలిపాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్ చేరకుండానే లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-11-08T13:10:14+05:30 IST