Share News

World Cup: టీమిండియాకు ప్రధాని ఓదార్పు.. రోహిత్, కోహ్లీ భుజంపై చేయి వేసి..

ABN , First Publish Date - 2023-11-21T11:43:02+05:30 IST

ప్రపంచకప్‌ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓడిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఆదివారం జట్టు ఓడిన అనంతరం స్వయంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన ఆయన ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. వారితో ప్రేమగా మాట్లాడిన మోదీ ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు.

World Cup: టీమిండియాకు ప్రధాని ఓదార్పు.. రోహిత్, కోహ్లీ భుజంపై చేయి వేసి..

అహ్మదాబాద్: ప్రపంచకప్‌ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓడిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఆదివారం జట్టు ఓడిన అనంతరం స్వయంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన ఆయన ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. వారితో ప్రేమగా మాట్లాడిన మోదీ ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ ఎక్స్(ట్విట్టర్)లో ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో ప్రధాని ఆటగాళ్లందరి దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా మాట్లాడడం కనిపిస్తోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసి వారికి ధైర్యం చెప్పారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం మనం గమనించవచ్చు. వారి భుజంపై చేయి వేసి మరి ప్రధాని ఓదార్చారు.


కన్నీటి పర్యంతమైన పేసర్‌ మహ్మద్‌ షమిని ప్రధాని హత్తుకొని అనునయించారు. కాగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫి అందించేందుకు ప్రధాని మోదీ అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లిన సంగంతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటమి బాధలో ఉన్న టీమిండియా ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంకు వెళ్లి ఓదార్చారు. ‘దురదృష్టవశాత్తు ఆ రోజు మనది కాదు. టోర్నీలో మాకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. మమ్మల్ని ఓదార్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్‌. మేం మరింత బలంగా పుంజుకొని తిరిగొస్తాం’ అని షమి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం జట్టులో ప్రేరణ నింపిందని జడేజా అన్నాడు. ‘ప్రపంచ కప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. దేశం గర్వించేలా ఆడారు. దేశం ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది’ అని ప్రధాని సోషల్‌ మీడియాలో రోహిత్‌ సేనను ప్రశంసించారు.

Updated Date - 2023-11-21T11:53:01+05:30 IST