Share News

World Cup: మరో 2 సిక్సులు కొడితే మైలుస్టోన్‌ రికార్డును చేరుకోనున్న విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2023-11-12T09:02:58+05:30 IST

Virat Kohli: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో 50+ రన్స్ చేస్తూ పరుగుల వరదపారిస్తున్నాడు. 500కుపైగా పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఏకంగా 108 సగటుతో 543 పరుగులు చేశాడు.

World Cup: మరో 2 సిక్సులు కొడితే మైలుస్టోన్‌ రికార్డును చేరుకోనున్న విరాట్ కోహ్లీ

బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో 50+ రన్స్ చేస్తూ పరుగుల వరదపారిస్తున్నాడు. 500కుపైగా పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఏకంగా 108 సగటుతో 543 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం 2 మ్యాచ్‌ల్లోనే కోహ్లీ నిరాశపరిచాడు. మిగతా అన్నింటిలో చెలరేగాడు. సగటు ఏకంగా 100కు పైగా ఉండడం విశేషం. ఈ క్రమంలో నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు కోహ్లీ సిద్ధమయ్యాడు. భారత్, నెదర్లాండ్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌తో లీగ్ దశ ముగియనుంది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మూడు రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 49 సెంచరీలు చేసిన కోహ్లీ.. మరొక సెంచరీ చేస్తే 50 సెంచరీలను పూర్తి చేసుకుంటాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(49) సెంచరీల రికార్డును అధిగమిస్తాడు. వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా కూడా నిలుస్తాడు. అలాగే మరొక 130 పరుగులు చేస్తే ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. కాగా సచిన్ 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు చేశాడు. ఇక మరొక రెండు సిక్సులు కొడితే వన్డేల్లో కోహ్లీ 150 సిక్సులను పూర్తి చేసుకుంటాడు. ఈ మైల్‌స్టోన్ రికార్డును అందుకున్న ఐదో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. కాగా తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 289 మ్యాచ్‌లాడిన కోహ్లీ 148 సిక్సులు కొట్టాడు.


ఇక ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాకు ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌ ఫలితంతో ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ప్రత్యర్థిపై ఎలాంటి అలసత్వం లేకుండా ఆడాలనుకుంటోంది. నెదర్లాండ్స్‌ ఇప్పటికే సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లకు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు డచ్‌ టీమ్‌ గెలిస్తే మాత్రం చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. పరుగుల వరద పారే ఈ స్టేడియంలో డచ్‌ బౌలర్లు వాన్‌ బీక్‌, బాస్‌ డి లీడ్‌, మీకెరెన్‌ భారత బ్యాటింగ్‌ లైనప్‌ను ఎలా అడ్డుకుంటారో చూడాల్సిందే. ఇక, టాపార్డర్‌ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ఆరు రోజుల విరామం తర్వాత మైదానం బరిలోకి దిగబోతున్న రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌ను సెమీఫైనల్‌కు ప్రాక్టీ్‌సగా భావించనుంది. ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో విశ్రాంతి లభించడంతో పూర్తి జట్టుతోనే బరిలోకి దిగనున్నట్టు కోచ్‌ ద్రవిడ్‌ తెలిపాడు. విరాట్‌ ఈ టోర్నీలో భీకర ఫామ్‌తో కొనసాగుతున్నాడు. అతను తొలిసారిగా వరల్డ్‌క్‌పలో 500+ పరుగులు సాధించడం విశేషం. అలాగే రోహిత్‌, గిల్‌, శ్రేయాస్‌, రాహుల్‌ ఫామ్‌పై ఆందోళన లేకపోయినా.. సూర్యకుమార్‌ సత్తా చాటాల్సి ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 85 పరుగులే చేసిన అతను డచ్‌పై బ్యాట్‌ ఝుళిపించాలని జట్టు కోరుకుంటోంది. పేస్‌ దళం షమి, బుమ్రా, సిరాజ్‌ ఎప్పటిలాగే ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడితే భారత్‌కు మరో భారీ విజయం ఖాయమే. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌ సైతం అదరగొడుతుండడం శుభ పరిణామం.

Updated Date - 2023-11-12T09:06:14+05:30 IST