Virat Kohli: ఆ మూడు రికార్డులపై కన్నేసిన కోహ్లీ.. ఈ సిరీస్‌లో వాటి పనిపట్టడం ఖాయం!

ABN , First Publish Date - 2023-02-07T18:32:58+05:30 IST

మూడేళ్లపాటు ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడిన టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఆసియాకప్ కలిసొచ్చింది.

Virat Kohli: ఆ మూడు రికార్డులపై కన్నేసిన కోహ్లీ.. ఈ సిరీస్‌లో వాటి పనిపట్టడం ఖాయం!

నాగ్‌పూర్: మూడేళ్లపాటు ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడిన టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఆసియాకప్ కలిసొచ్చింది. ఆ టోర్నీతో కోహ్లీ గడ్డుకాలం పోయింది. ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)పై సాధించిన సెంచరీ కోహ్లీలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఆ తర్వాతి నుంచి రన్ మెషీన్ మళ్లీ పరుగుల వేట ప్రారంభించాడు. సెంచరీలు బాదుతూ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. తాజాగా ఇప్పుడు కోహ్లీ మరోమూడు రికార్డులపై కన్నేశాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఈ నెల 9న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టెస్టుతో సిరీస్ ప్రారంభమవుతుంది. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), రిషభ్ పంత్‌(Rishab Pant) ఈ సిరీస్‌కు దూరం కావడంతో మిడిలార్డర్‌ భారమంతా కోహ్లీ మోయాల్సిందే. దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆ మూడు రికార్డులను కొల్లగొట్టాలని కోహ్లీ కృతనిశ్చయంతో ఉన్నాడు.

కోహ్లీ ఈ ఏడాదిని బాగానే ఆరంభించాడు. ఆరు వన్డేల్లో 67.6 సగటుతో 338 పరుగులు సాధించి ఊపుమీదున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో మరోమారు పరుగుల వరద పారించాలని భావిస్తున్న కోహ్లీని మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.

అత్యంత వేగంగా 25 వేల పరుగులు

కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డుల్లో మొదటిది ఇది. విరాట్ కనుక మరో 64 పరుగులు సాధిస్తే ఈ రికార్డు అతడి సొంతమవుతుంది. టెస్టుల్లో 8,119, వన్డేల్లో 12,809, టీ20ల్లో 4008 పరుగులు కలుపుకుని కోహ్లీ ఖాతాలో మొత్తంగా 24,936 పరుగులున్నాయి. 546 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ ఈ ఘనత సాధించాడు. వీటికి మరో 64 పరుగులు కనుక జోడిస్తే 25 వేల పరుగులు సాధించిన రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా ఆరో క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. అంతేకాదు, దీంతో పాటు మరో అరుదైన ఘనత కూడా అందుకుంటాడు. అత్యంత వేగంగా ఆ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగానూ చరిత్ర సృష్టిస్తాడు. ఈ జాబితాలో సచిన్ (Sachin Tendulkar) ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. టెండూల్కర్ 576 ఇన్నింగ్స్‌లలో ఆ ఘనత అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ ఈ రికార్డును బద్దలుగొట్టే అవకాశం ఉంది.

ఆ జాబితాలోకి కోహ్లీ..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ కన్నేసిన మరో రికార్డు ఇది. ఈ గోల్డెన్ చాన్స్‌ను కూడా కోహ్లీ అందిపుచ్చుకునే అవకాశం ఉంది. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ 8,119 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ కనీసం మరో 391 పరుగులు జోడిస్తే.. 8,503 పరుగులతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag)ను వెనక్కి నెట్టేసి ఆ స్థానానికి చేరుకుంటాడు.

గవాస్కర్ రికార్డుపైనా కన్ను

2018లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 123 పరుగులు చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరో రెండు సెంచరీలు కనుక సాధిస్తే సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) రికార్డును అధిగమిస్తాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఆసీస్‌పై కోహ్లీ 20 మ్యాచుల్లో 7 టెస్టు సెంచరీలు సాధించగా, గవాస్కర్ అన్నే మ్యాచుల్లో 8 సెంచరీలు సాధించాడు.

Updated Date - 2023-02-07T18:33:01+05:30 IST