Share News

IND W vs AUS W: మైదానంలోనే ఆసీస్ కెప్టెన్‌పై హర్మన్ ప్రీత్ కౌర్ ఆగ్రహం.. కానీ ఆ తర్వాతి బంతికే..

ABN , Publish Date - Dec 24 , 2023 | 05:05 PM

Harmanpreet kaur: టీమిండియా ఉమెన్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సహనం కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంపైర్‌కు అప్పీల్‌కు చేసింది. అసలు ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 80వ ఓవర్‌ను హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ చేసింది.

IND W vs AUS W: మైదానంలోనే ఆసీస్ కెప్టెన్‌పై హర్మన్ ప్రీత్ కౌర్ ఆగ్రహం.. కానీ ఆ తర్వాతి బంతికే..

ముంబై: టీమిండియా ఉమెన్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సహనం కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంపైర్‌కు అప్పీల్‌కు చేసింది. అసలు ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 80వ ఓవర్‌ను హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో హర్మన్ వేసిన మూడో బంతిని ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలే క్రీజు వదిలి బయటికి వచ్చి డిఫెన్స్ ఆడింది. ఆ బంతిని హర్మన్ అందుకుంది. అయితే హీలే క్రీజు బయటే ఉందని భావించిన హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ చేసేందుకు బంతిని స్టంప్స్ వైపు విసిరింది. ఆ బంతి కొంచెం ఎత్తులో హీలే వైపునకు వెళ్లింది. దీంతో బహుషా బంతి తనకు తగులుతుందనే భయంతో కావొచ్చు తప్పించుకునే క్రమంలో హీలే బ్యాట్‌ను అడ్డుగా పెట్టింది. బంతి బ్యాట్ హెడ్జ్ తీసుకుని వెనుకవైపు బౌండరీ వెళ్లింది. హీలే చర్య పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ సహనం కోల్పోయింది. హీలే చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా అంపైర్లకు కూడా అప్పీల్ చేసింది. కానీ హర్మన్ అప్పీల్‌ను అంపైర్లు తిరస్కరించారు.


అయితే ఆ తర్వాతి బంతికే హీలేను హర్మన్ ప్రీత్ కౌర్ పెవిలియన్ చేర్చడం విశేషం. అప్పటివరకు క్రీజులో చక్కగా కుదురుకున్న హీలేను హర్మన్ ప్రీత్ కౌర్ లెగ్‌బైస్‌లో ఔట్ చేసింది. 101 బంతులు ఎదుర్కొన్న హీలే 32 పరుగులు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా హర్మన్ ప్రీత్ కౌర్ మ్యాచ్ మధ్యలో సహనం కోల్పోయి ప్రవర్తించడం ఇది మొదటిసారేం కాదు. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో అయితే అంపైర్ నిర్ణయం నచ్చక ఏకంగా బ్యాట్‌తో స్టంప్స్‌ను కొట్టింది. ఇక ఈ టెస్టు మ్యాచ్ విషయానికొస్తే.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే మొదటి విజయం కావడం గమనార్హం.

ఆస్ట్రేలియా విసిరిన 75 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మహిళలు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించారు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 219 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు పూజా వస్త్రాకర్(4/53), స్నేహ్ రాణా (3/56), దీప్తి శర్మ(2/45) ఆస్ట్రేలియా పతనంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో భారత మహిళలు భారీ స్కోర్ సాధించారు. దీప్తి శర్మ(78), స్మృతి మంధాన(74), జెమీమా రోడ్రిగ్స్(73), రిచా ఘోష్ (52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో టీమిండియా 406 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా మహిళలకు 187 పరుగుల భారీ అధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 261 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ స్నేహ్ రాణా(4/63) చెలరేగింది. గైక్వాడ్, హర్మన్ ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ తీశారు. స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Updated Date - Dec 24 , 2023 | 05:05 PM