Veteran Cricketers: టీమిండియాలో ఇకపై వీళ్ల కెరీర్ ఖేల్ ఖతమేనా?

ABN , First Publish Date - 2023-09-06T20:26:49+05:30 IST

టీమిండియాలో గత కొంతకాలంగా శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అశ్విన్ లాంటి ఆటగాళ్లను సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. ఐపీఎల్ వంటి మెగా లీగ్‌లలో రాణిస్తున్నా వీళ్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదు. దీంతో వెటరన్ క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లేనా అని టీమిండియా అభిమానులు చర్చించుకుంటున్నారు.

 Veteran Cricketers: టీమిండియాలో ఇకపై వీళ్ల కెరీర్ ఖేల్ ఖతమేనా?

టీమిండియాలో సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అశ్విన్ లాంటి ఆటగాళ్లను సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. ఐపీఎల్ వంటి మెగా లీగ్‌లలో రాణిస్తున్నా వీళ్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదు. ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు సెలక్ట్ చేసినా తుది జట్టులో ఆడించలేదు. ఆ తర్వాత వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనలకు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆసియా కప్, ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలకు కూడా దూరం చేశారు.

శిఖర్ ధావన్ విషయానికి వస్తే.. నాలుగు ఐసీసీ టోర్నీలలో 1238 పరుగులు చేశాడు. 2010లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన ధావన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత మళ్లీ 2013లో వన్డే జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి ఓపెనర్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాణించాడు. 9 ఏళ్ల పాటు ఓపెనర్‌గా నిలకడగా ఆడాడు. 2022లో పరుగులు చేయడంలో విఫలం కావడం.. అదే సమయంలో గిల్ రాణించడం ధావన్‌ కెరీర్‌కు బ్రేక్ పడింది. అటు గత పదేళ్లలో తొలిసారిగా ఐసీసీ ఈవెంట్‌కు భువనేశ్వర్ కుమార్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. బంతిని పిచ్‌కు రెండు వైపులా స్వింగ్ చేయగల అతడు 2013 నుంచి 2018 వరకు మూడు ఫార్మాట్లలోనూ రాణించాడు. చివరి వన్డేను 2022లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ వన్డే జట్టులోకి అతడిని తీసుకోలేదు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ రాణిస్తుండటంతో సెలక్టర్లు భువీని పక్కనపెట్టేశారు.

ఇది కూడా చదవండి: Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ కేసు.. శ్రీలంక మాజీ క్రికెటర్ అరెస్ట్

2011లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడాడు. అయితే వచ్చే వన్డే ప్రపంచకప్‌కు మాత్రం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ అంచనాల మేరకు రాణించలేదు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేల్లో చాహల్, కుల్‌దీప్ ప్రత్యామ్నాయాలుగా మారారు. దీంతో అశ్విన్ స్థానంలో వాళ్లనే సెలక్టర్లు ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు చాహల్‌ను కూడా పక్కకు తప్పించి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించారు. దీంతో వెటరన్ క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లేనా అని టీమిండియా అభిమానులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2023-09-06T20:26:49+05:30 IST