Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ కేసు.. శ్రీలంక మాజీ క్రికెటర్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-06T17:59:47+05:30 IST

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్రా సేనానాయకే పోలీసుల ముందు లొంగిపోయాడు. 2020లో లంక ప్రీమియర్ లీగ్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ కేసు.. శ్రీలంక మాజీ క్రికెటర్ అరెస్ట్

మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకే (38) పోలీసుల ముందు స్వయంగా లొంగిపోయాడు. అతడు 2020లో లంక ప్రీమియర్ లీగ్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే ఫోన్ ద్వారా సంప్రదించినట్లు పలు నివేదికల ద్వారా బహిర్గతమైంది. సేనానాయకేపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని శ్రీలంక క్రీడాశాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌ను అటార్నీ జనరల్ కోరారు. దీంతో సేనానాయకే విదేశాలకు వెళ్లకుండా కోలంబో స్థానిక కోర్టు ట్రావెల్ బ్యాన్ విధించింది.

ఇది కూడా చదవండి: ICC rankings: టాప్‌లో గిల్, 12 స్థానాలు ఎగబాకిన కిషన్.. ర్యాంకింగ్స్‌లో మన కుర్రాళ్ల జోరు!

అయితే తనపై వచ్చిన ఆరోపణలను సచిత్ర సేనానాయకే ఖండించాడు. తనతో పాటు తన కుటుంబం పరువు తీయడానికి ఎవరో సృష్టించిన వదంతులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే తనకు నోటీసులు రావడంతోనే పోలీసుల ముందు లొంగిపోయినట్లు వివరించాడు. కాగా అంతర్జాతీయ కెరీర్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లోనూ సేనానాయకే నిలకడగా రాణించాడు. 112 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 567 వికెట్లు పడగొట్టాడు. 2012 నుంచి 2016 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఒక టెస్టు, 49 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడి తన సత్తా నిరూపించుకున్నాడు. వన్డేల్లో 53 వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లు తీసుకున్నాడు. 2016లో టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న జట్టులోనూ సేనానాయకే ఉన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో సెలక్టర్లు సేనానాయకేను పరిగణనలోకి తీసుకోవడం లేదు.

Updated Date - 2023-09-06T17:59:47+05:30 IST