Karnataka Elections: కాస్ట్లీగా కర్ణాటక ఎన్నికల ప్రచారం.. ఒక్కో హెలికాఫ్టర్‌కు గంటకు చెల్లించే అద్దెతో ఒక ఫ్యామిలీ నెలంతా ఎంజాయ్ చేస్తూ బతికేయొచ్చు..!

ABN , First Publish Date - 2023-04-19T17:39:43+05:30 IST

ఎన్నికల వేళ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే సమయం సరిపోదని భావిస్తున్న కర్ణాటక నేతలు.. ఖర్చు గురించి పెద్దగా ఆలోచించకుండా వాయుమార్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కర్ణాటకలో ఉన్నపళంగా హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. రేట్లు ఎలా ఉన్నాయో తెలిస్తే...

Karnataka Elections: కాస్ట్లీగా కర్ణాటక ఎన్నికల ప్రచారం.. ఒక్కో హెలికాఫ్టర్‌కు గంటకు చెల్లించే అద్దెతో ఒక ఫ్యామిలీ నెలంతా ఎంజాయ్ చేస్తూ బతికేయొచ్చు..!

బెంగళూరు: ఎన్నికల ప్రక్రియలో ప్రచారం (Election campaign) అత్యంత కీలక పర్వం. విజయం సాధిస్తే ప్రజలకు తాము ఏం చేయబోయేది... రాజకీయ ప్రత్యర్థుల కంటే తాము ఏవిధంగా మెరుగైన అభ్యర్థులమో ఓటర్లకు తెలియజెప్పే ఘట్టం ఇది. ఇక ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు వాగ్దానాలు, హామీలు గుప్పించేందుకు కీలకమైన దశ కూడా ఇదే. అందుకే పోలింగ్‌కు ముందు జరిగే ప్రచారపర్వం రాజకీయ పార్టీలకు ఎంతో ముఖ్యమైనది. ఎన్నిక ఏదైనా.. ఎక్కడైనా ఇదే ఒరవడి కనిపిస్తుంది. మరో 20 రోజుల్లోనే అసెంబ్లీ ఓటింగ్‌కు వెళ్తున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ (Karnataka poll) ఇదే పరిస్థితి నెలకొంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు ప్రచారం కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. కాగా ఎన్నికల సమయం మరింత చేరువవుతుండడంతో ఓటర్లకు చేరువయ్యేందుకు నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే సమయం సరిపోదని భావిస్తున్న పొలిటీషియన్స్.. ఖర్చు గురించి పెద్దగా ఆలోచించకుండా వాయుమార్గాల్లో ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కర్ణాటకలో ఉన్నపళంగా హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.

కర్ణాటక కీలక నేతలు రాష్ట్రమంతా చుట్టివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామమే అక్కడ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు భారీ డిమాండ్‌ పెరగడానికి కారణమైంది. కర్ణాటకలో 100 వరకు హెలికాప్టర్లు, చిన్నపాటి విమానాలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్ ఇంతకు మించి ఉండడంతో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, కోల్‌కతా, కొచ్చిన్‌ వంటి నగరాల నుంచి రప్పిస్తున్నారు. రాజకీయ నాయకులు మొత్తం 150కిపైగా బుక్‌ చేసుకున్నారు. భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి దాదాపు నెల రోజుల ముందే ఈ హెలికాఫ్టర్లను బుక్ చేసుకున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో ప్రైవేటు కంపెనీలు 15 శాతం అద్దె పెంచాయి. కొన్ని కంపెనీలైతే అద్దెను రెట్టింపు చేసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

హెలికాఫ్టర్, విమాన అద్దెలు ఇలా...

రెండు సీట్ల హెలికాప్టర్‌కు గంటకు జీఎస్టీతో కలిపి రూ.2.10 లక్షలుగా ఉంది. ఇక 4 సీట్ల హెలికాప్టర్‌కు రూ.2.30 లక్షలు, 6 సీట్ల హెలికాఫ్టర్‌కు రూ.2.60 లక్షలు చొప్పున కంపెనీలు వసూలు చేస్తున్నాయి. ఇక 8 సీట్ల చిన్న విమానానికి గంటకు రూ.3.50 లక్షలు, 13 సీట్ల విమానానికి రూ.4 లక్షలు చొప్పున కంపెనీలు వసూలు చేస్తున్నాయి. కాగా 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ హెలికాఫ్టర్లు, విమానాలకు ఇలాంటి డిమాండే కనిపించింది. హెలికాఫ్టర్ల వినియోగానికి 82 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కొన్నట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. కాగా కర్ణాటకకు చివరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 12 మే 2018న జరిగింది.

ఇవి కూడా చదవండి...

KCR: సీఎం కేసీఆర్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర పోలీసులు

Solar Eclipse : గురువారం సూర్య గ్రహణం.. ఇది చాలా ప్రత్యేకమైనది, అరుదైనది..

Updated Date - 2023-04-19T18:07:03+05:30 IST