TS BJP : హమ్మయ్యా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు, బీఆర్ఎస్తో సంబంధాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది..!
ABN , First Publish Date - 2023-06-10T22:46:14+05:30 IST
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని (TS BJP Chief) మార్చబోతున్నారని గత 24 గంటలుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) లేదా డీకే అరుణకు (DK Aruna) అధ్యక్ష పదవి కట్టబెట్టి..
![TS BJP : హమ్మయ్యా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు, బీఆర్ఎస్తో సంబంధాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది..!](https://media.andhrajyothy.com/media/2023/20230518/Clarity_on_TS_BJP_Chief_Cha_30e798e156.jpg)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని (TS BJP Chief) మార్చబోతున్నారని గత 24 గంటలుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) లేదా డీకే అరుణకు (DK Aruna) అధ్యక్ష పదవి కట్టబెట్టి.. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్కు (Bandi Sanjay) కేంద్ర మంత్రి (Central Minister) పదవి ఇస్తారని టాక్ నడిచింది. పైగా ఇదే టైమ్లో ఈటల హస్తిన (Etela Delhi Tour) పర్యటనలో ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. దీంతో అసలు బీజేపీలో ఏం జరుగుతోంది..? ఈ వార్తల్లో నిజమెంతో తెలియకపోవడం.. పైగా ఏ ఒక్కరూ రియాక్ట్ కాకపోవడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద హాట్ టాపిక్గానే మారింది. అయితే.. అధ్యక్షుడి మార్పులో నిజమెంత..? గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయ పరిణామాలేంటి..? ఇలా అన్ని విషయాలపై మీడియాతో చిట్చాట్ నిర్వహించిన బండి సంజయ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ఇంట్లో కూర్చుంటా..!
‘రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. పదవుల కోసం కాదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తను నేను. అధ్యక్షుడి మార్పు ప్రచారం గురించి ఆలోచించటం లేదు. జాతీయ నాయకత్వం పార్టీ కోసం పనిచేయమంటే చేస్తాను. ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటాను. బీజేపీ లీకుల పార్టీ కాదు.. కేంద్రంమంత్రి వర్గం విస్తరణ ఆఖరివరకు ఎవరకీ తెలియదు. బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ సమాజం డిసైడ్ అయింది. బీఆర్ఎస్తో కాకుండా.. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతోంది. బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనేది బీజేపీ మాత్రమే. ఒక్కో నియోజకవర్గంలో బీజేపీకి ముగ్గురు, నలుగురు అభ్యర్థులున్నారు. హుజూరాబాద్ సహా.. కాంగ్రెస్కు చాలా చోట్ల అభ్యర్థులు లేరు’ అని బండి చెప్పుకొచ్చారు.
ఎవరూ తప్పించుకోలేరు..!
‘దొంగలు ఎవరైనా సరే మోదీ హాయాంలో తప్పించుకోలేరు. ఆలస్యం కావొచ్చేమో కానీ అవినీతికి పాల్పడిన వారు జైలుకు పోవటం ఖాయం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన ఛార్జిషీటులో ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) పేరు లేకుంటే బీజేపీ-బీఆర్ఎస్కి (BJP-BRS) సంబంధం ఉన్నట్లా?. ఈడీ, సీబీఐ (ED, CBI) విచారణలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచటం కోసమే సీఎం కేసీఆర్ ఆ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ను విమర్శించవద్దని మాకు ఎవరూ డైరెక్షన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని జానారెడ్డి (Jana Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) లాంటి నేతలే చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం తయారుచేశాం. పార్టీ నిర్మాణం మాకు ముఖ్యం. నాయకుల మీద అధారపడి బీజేపీ పనిచేయదు. సీఎం కేసీఆర్ ముఖం తెలంగాణ ప్రజలకు నచ్చటం లేదు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
మీ శ్రమ వృథా కాదు..!
‘తెలంగాణ బీజేపీ కార్యకర్తల శ్రమ వృథాగా పోదు. కార్యకర్తలు, పార్టీ లక్ష్యం బీజేపీ అధికారంలోకి రావటమే. గుజరాత్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫేస్ ఎందుకు పనిచేయలేదు..?. రాహుల్ వల్లనే గెలిచామని కర్ణాటక కాంగ్రెస్ నేతలే ఒప్పుకోవటం లేదు. నిర్మల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ చెప్పగలరా?. నిర్మల్లో కాంగ్రెస్ను విమర్శించాల్సిన అవసరం కేసీఆర్కు ఏమొచ్చింది?’ అని గులాబీ బాస్, కాంగ్రెస్పై బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మొత్తానికి చూస్తే.. తెలంగాణ రాజకీయాలు బండి చిట్చాట్తో మరింత హీటెక్కాయి. గత కొన్నిరోజులుగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, వీరాభిమానుల్లో నెలకొన్న మిలియన్ డాలర్ల ప్రశ్నలకు బండి ఫుల్ క్లారిటీ సమాధానాలిచ్చేశారు. ఇప్పటి వరకూ బీజేపీ ఊసే ఎత్తని కేసీఆర్, మంత్రులు.. బండి కామెంట్స్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో.. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి బండిపై రియాక్షన్స్ ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.