Oman Air: మస్కట్ నుంచి భారత్‌లోని ఆ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్.. ఎప్పట్నుంచంటే..

ABN , First Publish Date - 2023-09-30T08:00:41+05:30 IST

ఒమాన్, భారత్‌ మధ్య రాకపోకలు కొనసాగించేవారికి ఒమాన్ ఎయిర్ (Oman Air) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని తిరువనంతపురం (Thiruvananthapuram) కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది.

Oman Air: మస్కట్ నుంచి భారత్‌లోని ఆ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్.. ఎప్పట్నుంచంటే..

మస్కట్: ఒమాన్, భారత్‌ మధ్య రాకపోకలు కొనసాగించేవారికి ఒమాన్ ఎయిర్ (Oman Air) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని తిరువనంతపురం (Thiruvananthapuram) కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఈ కొత్త విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. మస్కట్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానశ్రయానికి ఈ విమానం నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపనున్నట్లు ఒమాన్ ఎయిర్ ప్రకటించింది. 162 మంది ప్రయాణికులు ఈ సర్వీస్‌లో ప్రయాణించవచ్చు. వారంలో నాలుగు రోజులు విమాన సర్వీస్ నడవనుంది. ఆది, బుధ, గురు, శనివారాల్లో విమాన సర్వీస్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

విమాన సర్వీస్ షెడ్యూల్‌ ఇలా..

ఆది, బుధవారం ఉదయం 7.45 గంటలకు తిరువనంతపురంకు చేరుకుని, ఉదయం 8.45 గంటలకు తిరిగి మస్కట్‌ (Muscat) కి బయల్దేరుతుంది. గురువారం మధ్యాహ్నం 1.55 గంటలకు చేరుకుని తిరిగి సాయంత్రం 4.10 గంటలకు బయల్దేరుతుంది. అలాగే శనివారం తిరువనంతపురంకు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుని, తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు మస్కట్‌కి బయల్దేరి వెళ్తుంది. ఈ మేరకు విమానాశ్రయ అధికారులు ఈ విమాన సర్వీస్ తాలూకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఒమాన్ ఎయిర్ మరో కీలక ప్రకటన కూడా చేసింది. లక్నో-మస్కట్ (Lucknow-Muscat) మధ్య విమాన సర్వీస్ పున:ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్‌ను కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచే నడపనుంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే మస్కట్-తిరువనంతపురం నగరాల మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) డైలీ విమాన సర్వీస్‌ను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమాన్ ఎయిర్ రెండు నగరాలను కనెక్ట్ చేసే రెండవ క్యారియర్‌గా నిలిచింది.

Saudi Arabia: విదేశీ విజిటర్లకు సౌదీ అదిరిపోయే ఆఫర్.. ఏకంగా ఏడాది పాటు..


Updated Date - 2023-09-30T08:00:41+05:30 IST