Nitish Kumar: 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీకి విపక్షాల నిర్ణయం, సిమ్లాలో తదుపరి సమావేశం

ABN , First Publish Date - 2023-06-23T17:42:40+05:30 IST

విపక్షాల ఐక్య కూటమి ప్రయత్నాల కోసం బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం ఫలప్రదమైందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని తామంతా నిర్ణయించామని బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ తెలిపారు.

Nitish Kumar: 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీకి విపక్షాల నిర్ణయం, సిమ్లాలో తదుపరి సమావేశం

పాట్నా: విపక్షాల ఐక్య కూటమి (Opposition Unity) ప్రయత్నాల కోసం బిహార్ (Bihar) రాజధాని పాట్నాలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం ఫలప్రదమైందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని తామంతా నిర్ణయించామని బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ (Nitish kumar) తెలిపారు. ఆయన సారథ్యంలో పాట్నాలో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విపక్ష పార్టీల సమావేశం మధ్యాహ్నం 3.30 గంటల వరకూ జరిగింది. సమావేశానంతరం నితీష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు నితీష్ ఈ సందర్భంగా తెలిపారు.

సిమ్లాలో మళ్లీ కలుస్తాం: ఖర్గే

విపక్షల పార్టీల తదుపరి సమావేశం సిమ్లాలో జరుగుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. సిమ్లా సమావేశంలో 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో కలిసికట్టుగా ఏవిధంగా పోరాడాలనే విషయంపై ఒక ఎజెండాను రూపొందిస్తామని చెప్పారు.

సిద్ధాంతాల మధ్య పోరు ఇది: రాహుల్

ఇది సిద్ధాంతాల మధ్య పోరు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నిజానికి, తమలో విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నామని, సిద్ధాంతాలపై పరస్పరం చర్చించుకుని వాటిని పరిరక్షించుకునేందుకు కృషిచేయాలని నిర్ణయించామని చెప్పారు. దేశపునాదులపై బీజేపీ దాడి చేస్తోందని, ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని అన్నారు.

కలిసే ఉన్నాం..కలిసికట్టుగా పోటీ చేస్తాం: మమత

విపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని, కలిసికట్టుగానే ఎన్నికల్లో పోరాడతాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ చెప్పారు. ఇక్కడ (బీహార్) నుంచే చరిత్ర ప్రారంభమైందని, హిస్టరీని మార్చాలని బీజేపీ కోరుకుంటోందని అన్నారు. బీహార్‌ నుంచే చరిత్రను కాపాడాలని తాము అనుకుంటున్నట్టు చెప్పారు. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే తమ లక్ష్యమని చెప్పారు.

జమ్మూకశ్మీర్‌కు చేరని ప్రజాస్వామ్యం: ఒమర్ అబ్దుల్లా

అతలాకుతలమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, తిరిగి ప్రజాస్వామ్యాన్ని పాదుకొలిపేందుకు విపక్ష పార్టీలన్నీ పాట్నాలో సమావేశమైనట్టు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రజాస్వామ్యం హత్యకు గురైన దేశంలోనే తాను, మెహబూబూ ముఫ్తీ ఉన్నామని అన్నారు. ప్రజాస్వామ్యంపై అమెరికాలో గురువారంనాడు చర్చలు జరిగాయని, జమ్మూకశ్మీర్‌కు ప్రజాస్వామ్యం ఎందుకు చేరువకాలేదని ఒమర్ ప్రశ్నించారు.

16 పార్టీల నేతలు హాజరు

కాగా, నితీష్ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతలు పాల్గొన్నారు. తదుపరి సమావేశం మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో సిమ్లాలో జూలై 10-12 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-23T17:42:40+05:30 IST