Narendra Modi : దేశంలో నైరాశ్యాన్ని నింపుతున్నవారికి దీటైన సమాధానం : మోదీ
ABN , First Publish Date - 2023-08-12T12:48:46+05:30 IST
దేశమంతా నైరాశ్యం నింపుతున్నవారికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దీటుగా సమాధానం చెప్పిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లోక్ సభలో తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీలను ఓడించిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ : దేశమంతా నైరాశ్యం నింపుతున్నవారికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దీటుగా సమాధానం చెప్పిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోక్ సభలో తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీలను ఓడించిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ఆ పార్టీలు భయపడ్డాయనేది సత్యమని తెలిపారు.
పశ్చిమ బెంగాల్లోని బీజేపీ క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్ సమావేశాన్ని ఉద్దేశించి శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ, మణిపూర్ సమస్యపై చర్చించాలనే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని, అందుకే ఆ పార్టీల నేతలు అవిశ్వాస తీర్మానంపై చర్చలో కేవలం ఆరోపణలు మాత్రమే చేశారని, తర్కబద్ధత లేకుండా మాట్లాడారని అన్నారు. బీజేపీ నేతలు ఎటువంటి అహంకారం లేకుండా పని చేస్తున్నారని, ప్రజల మనసులను గెలుచుకుంటున్నారని చెప్పారు. కోల్కతాలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ బెదిరించిందని, పోలింగ్ బూత్లను ఆక్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకుండా అన్ని రకాలుగా టీఎంసీ అడ్డుకుందని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను మాత్రమే కాకుండా, ప్రజలను కూడా టీఎంసీ నేతలు, కార్యకర్తలు బెదిరించారన్నారు. పోలింగ్ బూత్ల ఆక్రమణ కోసం గూండాలకు కాంట్రాక్టు ఇచ్చారని దుయ్యబట్టారు. టీఎంసీ రాష్ట్రంలో రాజకీయాలు చేసే తీరు ఇదేనన్నారు. ప్రతిపక్షాలను బెదిరించడానికి హింసను ఆయుధంగా వాడుకున్నారన్నారు. ఇన్ని రకాల బెదిరింపులు ఉన్నప్పటికీ, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలను అభినందించారు.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8 నుంచి 10 వరకు లోక్ సభలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చకు మోదీ ఈ నెల 10న సమాధానం చెప్తుండగానే ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఈ తీర్మానం మూజువాణీ ఓటుతో వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం వల్ల తమకు అదృష్టం లభిస్తోందని మోదీ చెప్పారు.
ఇవి కూడా చదవండి :
UP Assembly : నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ