Bharatiya Nyaya Sanhita : పెళ్లి పేరుతో మహిళను అనుభవించే దుష్టుడికి పదేళ్ల జైలు శిక్ష.. కేంద్రం ప్రతిపాదన..

ABN , First Publish Date - 2023-08-12T10:45:42+05:30 IST

భారత శిక్షా స్మృతి (IPC), 1860కి బదులుగా భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం పార్లమెంటుకు సమర్పించారు. వలసవాద ధోరణికి చెల్లుచీటీ రాస్తూ, అనేక సంస్కరణలను ప్రతిపాదించారు.

Bharatiya Nyaya Sanhita : పెళ్లి పేరుతో మహిళను అనుభవించే దుష్టుడికి పదేళ్ల జైలు శిక్ష.. కేంద్రం ప్రతిపాదన..
Amit Shah

న్యూఢిల్లీ : భారత శిక్షా స్మృతి (IPC), 1860కి బదులుగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita-BNS)ను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం పార్లమెంటుకు సమర్పించారు. వలసవాద ధోరణికి చెల్లుచీటీ రాస్తూ, అనేక సంస్కరణలను ప్రతిపాదించారు. మహిళలను మోసం చేసేవారిని కఠినంగా శిక్షించడం కోసం కూడా ప్రత్యేక నిబంధనలను ప్రతిపాదించారు.

అమిత్ షా మాట్లాడుతూ, మహిళలపై నేరాలు, వారు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను ఈ బిల్లులో ప్రస్తావించినట్లు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని, పదోన్నతి కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ మహిళ/యువతితో సంగమించడం, తన గురించి తప్పుడు వివరాలు చెప్పి ఓ మహిళ/యువతితో సంగమించడం నేరం అని ఈ బిల్లు చెప్తోందన్నారు. దీనిని నేరంగా పరిగణించడం ఇదే తొలిసారి అని చెప్పారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు మహిళలు కోర్టులను ఆశ్రయించినపుడు, ఐపీసీలో దీనికి సంబంధించిన నిర్దిష్ట నిబంధన లేకపోవడంతో న్యాయస్థానాలు ఇబ్బందిపడుతున్నాయి. ఈ ఇబ్బందులను నివారించేందుకు తాజా బిల్లు ప్రయత్నిస్తోంది.


‘‘మాయోపాయాలతో లేదా పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే ఉద్దేశం లేకుండా, ఓ యువతి/మహిళతో లైంగిక సంభోగంలో పాల్గొనే ఎవరైనా, అత్యాచారంగా పరిగణింపబడని అటువంటి లైంగిక సంభోగం చేసినందుకు, గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో శిక్షింపబడుదురు, అదేవిధంగా జరిమానాకు కూడా పాత్రులగుదురు’’ అని ఈ బిల్లు ప్రతిపాదించింది. మాయోపాయాలు అంటే ఏమిటో కూడా ఈ బిల్లు వివరించింది. ఉద్యోగం ఇప్పిస్తానని, పదోన్నతి ఇప్పిస్తానని, తప్పుడు వాగ్దానం చేయడం, లేదా తన సొంత వివరాలను మరుగుపరచి పెళ్లి చేసుకోవడం, ప్రోద్బలం చేయడం మాయోపాయాలు అవుతాయని వివరించింది.

ఈ ప్రతిపాదనను న్యాయ నిపుణులు సమర్థిస్తున్నారు. ఇది లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఇటువంటి చర్యలను నేరాలుగా పరిగణించడం లేదన్నారు. ఇరు పక్షాలు తమకు నచ్చినట్లుగా అర్థాలు చెప్తున్నాయన్నారు. మతాంతర వివాహాలను అడ్డుకునేందుకే, ‘సొంత వివరాలను మరుగుపరచి పెళ్లి చేసుకోవడం’ అనే నిబంధనను పెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. పెళ్లి పేరుతో మహిళలకు అన్యాయం చేయడాన్ని నిరోధించడానికి ఇది దోహదపడుతుందని మరికొందరు అంటున్నారు.


ఇవి కూడా చదవండి :

UP Assembly : నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ

State BJP president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - 2023-08-12T10:48:13+05:30 IST