UP Assembly : నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ

ABN , First Publish Date - 2023-08-12T09:38:37+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభలో శుక్రవారం నవ్వులే నవ్వులు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణ సభలో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని శివపాల్ యాదవ్ కోరడంతో సీఎం చతురతతో స్పందించి, నవ్వులు పూయించారు.

UP Assembly : నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ
Uttar Pradesh Assembly

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభలో శుక్రవారం నవ్వులే నవ్వులు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ (Shivpal Yadav) మధ్య జరిగిన సంభాషణ సభలో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని శివపాల్ యాదవ్ కోరడంతో సీఎం చతురతతో స్పందించి, నవ్వులు పూయించారు.

శివపాల్ యాదవ్ మాట్లాడుతూ, ‘‘గౌరవనీయ ముఖ్యమంత్రి గారూ, దయచేసి త్వరగా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించండి, లేదంటే ఆయన మళ్లీ మా వైపు వచ్చేస్తారు’’ అన్నారు. వెంటనే సభ్యులు గొల్లుమని నవ్వారు.

శివపాల్ యాదవ్ మాటలను విన్న యోగి ఆదిత్యనాథ్ నవ్వును ఆపుకోలేకపోయారు. కానీ త్వరగానే నియంత్రించుకుని, ‘‘అధికారంలో ఉన్నపుడు మీరు మీ మేనల్లుడికి (అఖిలేశ్ యాదవ్‌కు) నచ్చజెప్పి ఉంటే, రైతులు ప్రయోజనం పొంది ఉండేవారు. కానీ మీ మేనల్లుడు మీ మాట వినడానికి సిద్ధంగా లేరు’’ అన్నారు.

శివపాల్ స్పందిస్తూ, ‘‘మేం చెప్పాము కాబట్టే ఆయన ఇంజినీర్ అయ్యాడు. యూపీ ముఖ్యమంత్రి అయ్యాడు’’ అన్నారు.


అఖిలేశ్ యాదవ్ జోక్యం చేసుకుని, ‘‘ముఖ్యమంత్రికి కూడా కొంచెం చదువు చెప్పాలి. దయచేసి ఆయన చేత ట్యూషన్ చెప్పించుకోండి’’ అన్నారు.

యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం శాసన సభలో చాలాసార్లు అఖిలేశ్, శివపాల్ పేర్లను ప్రస్తావించారు. ఆరుసార్లు గెలిచి శివపాల్ మళ్లీ గెలిచి, సభకు రావడం చాలా కష్టమన్నారు. 2012-2017 మధ్య కాలంలో మామాఅల్లుళ్ల మధ్య తగాదాల వల్ల రాష్ట్ర ప్రజలు బాధితులయ్యారన్నారు. మామ ఆధిపత్యం చలాయిస్తారని మేనల్లుడు భయపడ్డారని, ఆయనకు ఆర్థిక సాయం అందకుండా కట్టడి చేశారని చెప్పారు. అందుకే 2012 నుంచి 2017 మధ్య కాలంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎనిమిది ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. 2017-2022 మధ్య కాలంలో తన ప్రభుత్వం 20 ప్రాజెక్టులను పూర్తి చేసిందన్నారు. 2012 నుంచి 2017 మధ్య కాలంలో 1,95,900 హెక్టార్లకు సాగు నీరు అందిందని, 2017 నుంచి 2022 మధ్య కాలంలో తన ప్రభుత్వ హయాంలో 23,17,000 హెక్టార్లకు సాగునీటి సదుపాయం విస్తరించిందని చెప్పారు. తన ప్రభుత్వ హయాంలో 44 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. రాష్ట్రంలో వరదలు, కరువు పరిస్థితులపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజ్‌భర్ గతంలో యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. 2022 శాసన సభ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన తిరిగి ఎన్డీయేలో చేరారు.


ఇవి కూడా చదవండి :

Private buses: వరుస సెలవుల ఎఫెక్ట్‌.. ప్రైవేటు బస్సుల్లో చార్జీల మోత

State BJP president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - 2023-08-12T09:38:37+05:30 IST