Digvijaya Vs Kapil : దిగ్విజయ సింగ్‌పై కపిల్ సిబల్ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-31T10:36:01+05:30 IST

పరువు నష్టం కేసులో శిక్ష పడటంతో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీకి అమెరికా,

Digvijaya Vs Kapil : దిగ్విజయ సింగ్‌పై కపిల్ సిబల్ ఆగ్రహం
Digvijaya Singh, Kapil Sibal

న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో శిక్ష పడటంతో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీకి అమెరికా, జర్మనీ మద్దతివ్వడంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ జర్మనీకి ధన్యవాదాలు చెప్పారు. దీంతో కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మండిపడ్డారు. విదేశాల నుంచి మద్దతు మనకు అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎలా ఉంటోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ దోషి అని తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం పార్లమెంటు సచివాలయం ఆయనను వయనాద్ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఆయన అపీలు చేసుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి మద్దతుగా అమెరికా, జర్మనీ మాట్లాడాయి. జర్మనీకి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ (Congress Senior Leader Digvijaya Singh) ధన్యవాదాలు చెప్పారు. దిగ్విజయ సింగ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) వ్యతిరేకించారు.

కపిల్ సిబల్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా దెబ్బతింటోందో గమనించినందుకు జర్మనీకి దిగ్విజయ సింగ్ ధన్యవాదాలు చెప్పారని తెలిపారు. మనం ముందుకు నడవడానికి ఊతకర్రలు మనకు అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పారు. విదేశాల నుంచి మనకు మద్దతు అవసరం లేదని తన అభిప్రాయమని తెలిపారు. మన పోరాటం మనదేనని, ఆ పోరాటంలో మనమంతా కలిసికట్టుగా ఉన్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హుష్ మనీ కేసు

Gold and Silver Price : మార్చిలోనే రూ.60 వేలు దాటేసిన బంగారం..

Updated Date - 2023-03-31T10:36:01+05:30 IST