Afghanistan Embassy: భారత్‌లోని ఆప్ఘనిస్థాన్ ఎంబసీ మూసివేత.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-10-01T12:40:37+05:30 IST

మన దేశంలో నేటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం మూతపడనుంది. భారతదేశంలో నేటి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ ప్రకటించింది.

Afghanistan Embassy: భారత్‌లోని ఆప్ఘనిస్థాన్ ఎంబసీ మూసివేత.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: మన దేశంలో నేటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం మూతపడనుంది. భారతదేశంలో నేటి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడమే దీనికి ప్రధానంగా కారణంగా ఆప్ఘనిస్థాన్ తెలిపింది. అలాగే ఆఫ్ఘనిస్తానీలకు ప్రయోజనాలను అందించడంలో అంచనాలను అందుకోలేకపోవడం, సిబ్బంది కొరత, వనరుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్‌, భారత్‌ల మధ్య చిరకాల బంధాలు, స్నేహబంధాన్ని పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ఆలోచించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. "న్యూ ఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం తన కార్యకలాపాలను నిలిపివేయడం తీవ్ర విచారం," అని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ప్రకటనలో తెలిపింది. అతిథ్య దేశం భారత్ నుంచి తమకు సరైన సహకారం అందడం లేదని, దీంతో తమ విధులను సరిగ్గా నిర్వర్తించలేకపోయామని, ఈ కారణంగానే తమ కార్యకలాపాలను సమర్థవంగా నిర్వహించలేకపోతున్నామని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం ఆరోపంచింది.


న్యూ ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయానికి దౌత్యవేత్తగా ఫరీద్ మముంద్‌జాయ్ నాయకత్వం వహించారు. ఆయన అష్రఫ్ ఘనీ ప్రభుత్వంచే నియమించబడ్డారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ దళాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆయన తన పదవిలో కొనసాగారు. "భారత్‌ నుంచి దౌత్యపరమైన మద్దతు లేకపోవడం, కాబూల్‌లో చట్టబద్ధంగా పనిచేసే ప్రభుత్వం లేకపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు సరైన ప్రయోజనాలను అందించడంలో మా లోపాలను మేము అంగీకరిస్తున్నాము. ఎంబసీ ఊహించని పరిస్థితుల కారణంగా దౌత్యకార్యాలయం సిబ్బంది, వనరుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల కార్యకలాపాలు కొనసాగించడం కష్టతరంగా మారింది. దౌత్యవేత్తలకు, ఇతర కీలకమైన సహకార రంగాలకు సకాలంలో వీసా పునరుద్ధరణ, తగినంత మద్దతు లేకపోవడం మా బృందంలో నిరాశకు దారితీసింది. సాధారణ విధులను సమర్థవంతంగా నిర్వహించే మా సామర్థ్యానికి ఆటంకం కలిగించింది. ఈ నిర్ణయం కారణంగా కొంతమంది వ్యక్తులు కాబూల్‌లోని తాలిబాన్ పాలన నుంచి మద్దతు, సూచనలను అందుకోవచ్చు. ఇది ఎంబసీ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉండవచ్చు. " అని రాయబార కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కాగా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఏ దేశానికి కూడా వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘన్ నేలను ఉపయోగించకుండా నిరోధించాలని డిమాండ్ చేసింది.

Updated Date - 2023-10-01T12:41:20+05:30 IST