Parliament : పార్లమెంటులో ఆగని ‘అదానీ’ ప్రకంపనలు

ABN , First Publish Date - 2023-02-08T14:00:21+05:30 IST

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు బుధవారం కూడా కొనసాగాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలపై దర్యాప్తు

Parliament : పార్లమెంటులో ఆగని ‘అదానీ’ ప్రకంపనలు
Parliament

న్యూఢిల్లీ : పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు బుధవారం కూడా కొనసాగాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ గ్రూప్ షేర్ల విలువ పతనమవడం అతి పెద్ద కుంభకోణమని ఆరోపించాయి. ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ, ఎస్‌బీఐ ఈ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టినందువల్ల ఇది సామాన్యుల సొమ్ముకు సంబంధించిన విషయమని పేర్కొన్నాయి. అదానీ గ్రూప్‌పై తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన థాకరే వర్గం, బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. రూల్ 267 ప్రకారం కే కేశవరావు (బీఆర్ఎస్), సంజయ్ సింగ్ (ఆప్), శివసేన థాకరే వర్గం సభ్యులు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది ఇచ్చిన నోటీసులను అనుమతించడం లేదని ధన్‌కర్ ప్రకటించారు. దీంతో ఈ పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలో ఎక్కువ సమయం గడపాలని కోరారు. ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన మంత్రులు, ఎంపీలు హిందూ-ముస్లిం అంటూ మాట్లాడుతున్నారన్నారు. మాట్లాడటానికి ఇతర అంశాలేవీ వారికి దొరకలేదా? అని నిలదీశారు. దేవాలయాల్లోకి ప్రవేశించే ఎస్సీలను కొడుతున్నారన్నారు. వారిని హిందువులుగా పరిగణిస్తే, దేవాలయాల్లోకి వారిని ఎందుకు ప్రవేశించనివ్వడం లేదని ప్రశ్నించారు. వారు చదువుకోవడానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఎస్సీల ఇళ్లలో భోజనం చేస్తున్నట్లు కనిపించే ఫొటోలను చాలా మంది మంత్రులు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినదానినే రాష్ట్రపతి, గవర్నర్లు పునరుద్ఘాటించడం తరచూ జరుగుతోందన్నారు. అయితే ఈసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మైనారిటీల గురించి మాట్లాడతారని తాను ఆశించానని, కానీ తనకు నిరాశే మిగిలిందని అన్నారు. నిజం మాట్లాడితే తాను జాతి వ్యతిరేకిని అవుతానా? అని నిలదీశారు. ‘‘నేను దేశ వ్యతిరేకిని కాను. ఇక్కడ ఉన్నవారిలో ఎవరితో పోల్చుకున్నా నేను గొప్ప దేశభక్తుడిని. నేను భూమి పుత్రుడిని. మీరు దేశాన్ని దోచుకుంటున్నారు, నన్ను దేశ వ్యతిరేకి అంటున్నారు’’ అని మండిపడ్డారు.

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పదే పదే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగ్‌దీప్ ధన్‌కర్ మాట్లాడుతూ, దేశానికి మనం చెడు సందేశాన్ని పంపిస్తున్నామన్నారు. వ్యూహాత్మకంగానే ఈ విధంగా చేస్తున్నారన్నారు. రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీ గ్రూప్ అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తడంతో గందరగోళం ఏర్పడింది.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ లోక్‌సభలో బుధవారం రాహుల్ గాంధీపై ప్రివిలెజ్ మోషన్‌ను ప్రతిపాదించారు. పార్లమెంటు నిబంధనల ప్రకారం ఓ ఎంపీ ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎటువంటి ఆరోపణలు చేయరాదన్నారు. ఓ కాంగ్రెస్ నేత (రాహుల్ గాంధీ) మంగళవారం నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డుల నుంచి తొలగించాలన్నారు.

బీజేపీ ఎంపీ నిసికాంత్ దుబే బుధవారం రాహుల్ గాంధీపై ప్రివిలెజ్ మోషన్‌ను ప్రతిపాదించారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయరాదన్నారు. సభలో లేని వ్యక్తి తనను తాను సమర్థించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆ వ్యక్తిపై ఆరోపణలు చేయరాదన్నారు. ముందుగా నోటీసు ఇచ్చి, స్పీకర్ అనుమతి పొందాలన్నారు.

బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో మాట్లాడుతూ, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు అదానీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉంటే ప్రతిపక్షాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీ ప్రాజెక్టుల గురించి వివరించారు. రక్షణ దళాల్లో నియామకాల కోసం అమలు చేస్తున్న అగ్నివీర్ పథకంపై ముందుగా తగిన విధంగా సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, త్రివర్ణ పతాకం నుంచి ఆకుపచ్చ రంగును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందా? అని ప్రశ్నించారు. ఆకుపచ్చ రంగుతో మోదీ ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఎందుకని ప్రశ్నించారు.

Updated Date - 2023-02-08T14:00:27+05:30 IST