తస్మాత్ జాగ్రత్త.. ఆన్‌లైన్ జాబ్ అన్నారు.. రూ.10 లక్షలు కొట్టేశారు.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-26T16:40:12+05:30 IST

ఆన్‌లైన్ జాబ్ పేరుతో వాట్సాప్‌లో వచ్చిన ఓ ఫేక్ సందేశాన్ని నమ్మి నిండా మునిగాడు ఓ ఫుట్‌బాల్ కోచ్. ఆన్‌లైన్ స్కామర్ల వలలో పడి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా దాదాపు 10 లక్షల రూపాయలను పొగొట్టుకున్నాడు.

తస్మాత్ జాగ్రత్త.. ఆన్‌లైన్ జాబ్ అన్నారు.. రూ.10 లక్షలు కొట్టేశారు.. అసలు ఏం జరిగిందంటే..?

ఆన్‌లైన్ జాబ్ పేరుతో(online job) వాట్సాప్‌లో(WhatsApp) వచ్చిన ఓ ఫేక్ సందేశాన్ని నమ్మి నిండా మునిగాడు ఓ ఫుట్‌బాల్ కోచ్(football coach). ఆన్‌లైన్ స్కామర్ల(Online scammers) వలలో పడి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా దాదాపు 10 లక్షల రూపాయలను పొగొట్టుకున్నాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో(Mumbai) జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోయెల్ చెట్టి(Joel Chetty) అనే 28 ఏళ్ల(28-year-old) ఫుట్‌బాల్ కోచ్ ముంబైలోని మలాడ్ వెస్ట్‌లో(Malad West) నివసిస్తున్నాడు. పార్ట్ టైమ్ జాబ్(part-time job) ఇప్పిస్తామంటూ అతనికి ఇటీవల వాట్సాప్‌లో ఓ సందేశం వచ్చింది. డిజిటల్ ఒసియన్ ఎల్‌ఎల్‌సీ ఇండియా అనే కంపెనీలో(Digital Osian, L.L.C. India) పని చేస్తున్నానని చెబుతూ నేహా(Neha) అనే వ్యక్తి నుంచి ఆ సందేశం వచ్చింది. సందేశంలో ఉన్న వివరాల ప్రకారం యూట్యూబ్ ఛానెల్‌ను సబ్స్‌క్రైబ్ చేసి(subscribing to a YouTube channel), దాని స్క్రీన్ షాట్లు(screenshots) తీసి, ఆ ఫోటోలను కంపెనీకి పంపడమే ఆ జాబ్‌లో చేయాల్సిన పని.


దీనిని నమ్మిన జోయెల్ ఉద్యోగం చేయడానికి అంగీకరించాడు. దీంతో స్కామర్ అతనికి టెలిగ్రామ్(Telegram) ద్వారా ఓ లింక్ పంపించాడు. జోయెల్ యూపీఐ ఐడీతోపాటు(UPI ID) అతని వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు(bank details) అడిగి తెలుసుకున్నాడు. జోయెల్ జాబ్‌లో చేరాక ఒక టాస్క్‌ను పూర్తి చేసినందుకుగాను రూ.150 ఇచ్చారు. ఆ తర్వాత రూ.2 వేల విలువైన టాస్క్‌ను పూర్తి చేసి రూ.2,800 అందుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతే మొదలైంది అసలు ఆట. ఆ తర్వాత జోయెల్‌ పేరుతో అకౌంట్ సృష్టిండానికి స్కామర్ రూ.9,000 డిమాండ్ చేశాడు. ఆ తర్వాత టాస్క్ ఆర్డర్ ఇవ్వడానికి రూ.40,000 తీసుకున్నాడు. అలా వివిధ సాకులతో ఆగస్టు 16 నుంచి 21 మధ్య జోయెల్ నుంచి స్కామర్లు ఏకంగా రూ.9,87,620 వసూలు చేశారు.

దీంతో తాను మోసపోయానని గ్రహించిన జోయెల్ జరిగిన విషయాన్ని తన సోదరితో చెప్పాడు. అనంతరం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులపై జోయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 34, 419, 420, 66(సీ), 66(డీ) సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో(Social Media) వచ్చే సందేశాలను నమ్మకూడదని ఈ ఘటనతో మరోసారి నిర్ధారణ అయిందని పలువురు అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నమ్మి గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాల గురించి చెప్పకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-08-26T16:40:12+05:30 IST