Share News

CPI Ramakrishna: జగన్ 11 లక్షల కోట్లను అప్పు తెచ్చి.. ఏం చేశాడో చెప్పాలి

ABN , Publish Date - Dec 24 , 2023 | 06:36 PM

జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లుకు చేరుతుందని ముందునుంచే చెబుతున్నామని.. అయితే ఆయన దాన్ని మించి 11 లక్షల కోట్లను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పుగా తీసుకున్నాడని వాటిని ఏం చేశాడో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యం ఏలుతుందా’’ అనే అంశంపై ఆదివారం నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

CPI Ramakrishna: జగన్ 11 లక్షల కోట్లను అప్పు తెచ్చి..  ఏం చేశాడో చెప్పాలి

విజయవాడ: జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లుకు చేరుతుందని ముందునుంచే చెబుతున్నామని.. అయితే ఆయన దాన్ని మించి 11 లక్షల కోట్లను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పుగా తీసుకున్నాడని వాటిని ఏం చేశాడో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యం ఏలుతుందా’’ అనే అంశంపై ఆదివారం నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రాష్ట్రాన్ని అప్పలు పాలు చేశారని.. రుణగ్రస్తం చేశారని కొందరు అంటున్నారని చెప్పారు. తాము మాత్రం అసలు అప్పు చేసిన సొమ్ముని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ కన్నా తాము తక్కువగా అప్పు చేశామని.. తాము అప్పు చేసిన పైసలను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశామని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. అప్పు చేసిన సొమ్ము నుంచి జనాలకు రెండు లక్షల 60వేల కోట్లు పంచామని చెప్పారన్నారు. అలా అయతే ప్రకాశం జిల్లాల్లో గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో నెంబర్ గేటు కొట్టుకుపోతే 8 కోట్లను రిపేర్లకు ఎందుకు నేటికి ఇవ్వలేదని ప్రశ్నించారు. తాజాగా మొన్న ఇంకో గేటు కూడా కొట్టుకుపోయిందని రామకృష్ణ చెప్పారు.

ఏపీ ఆర్థిక దిగ్భందంలో కూరుకు పోయింది

కడప జిల్లాల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం మెయింటెనెన్స్‌కు డబ్బులు ఇవ్వకపోవడం కాదా అని రామకృష్ణ నిలదీశారు. దీంతో ప్రాజెక్టు కొట్టుకుపోయి 39మంది చనిపోయారని, రెండు గ్రామాలు కొట్టుకుపోయాయని చెప్పారు. అప్పుచేసిన డబ్బుతో ప్రాజెక్టులు, పరిశ్రమలు పెట్టలేదు, కడప స్టీల్ ప్లాంట్ కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదని ధ్వజమెత్తారు. ఏపీ పూర్తిస్థాయిలో ఆర్థిక దిగ్భందంలో కూరుకు పోయిందన్నారు. అప్పుల విషయంలో ఐఏఎస్‌లు కూడా కేసులు వేయాలని రామకృష్ణ చెప్పారు. రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో వస్తే జగన్ జైలుకి వెళ్తాడు... అప్పుడు ఇంత అప్పు ఉన్న రాష్ట్రం ఏమవ్వాలని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రతి ఏడాది 50 వేల నుంచి 60 వేల కోట్లు చెల్లింపులు చేయాలంటే ఏపీలో తర్వాత వచ్చే ప్రభుత్వం ఇతర ఖర్చులు ఎలా భరించాలి అని నిలదీశారు. 2014 జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఆదాయం కన్నా ఏపీ ఆదాయం ఎక్కువ. తెలంగాణలో 51 వేల కోట్ల ఆదాయం ఉంటే.. ఏపీకి 65వేల కోట్ల ఆదాయం అప్పట్లో ఉందని తెలిపారు. ఇప్పుడు మనకంటే 1075కోట్లు ఎక్కువ ఆదాయం అక్కడ ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 06:37 PM