ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ చల్లని కబురు..
ABN , Publish Date - May 11 , 2026 | 02:05 PM
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఉక్క పోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.
న్యూఢిల్లీ, మే11: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇలాంటి సమయంలో భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం వెల్లడించింది.
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వివరించింది. రవాణా, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. మే 12వ తేదీ వరకు రాజస్థాన్లో దుమ్ము, ధూళీతో కూడిన వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
కేరళ, తమిళనాడు, పుదుచ్చెరి, కరైకల్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, హిమాచల్ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, బిహార్లలో ఉరుము, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని చెప్పింది.
దేశంలోని వాయువ్య ప్రాంతం పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, న్యూఢిల్లీలలో ఉరుములు మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. మే 11 నుంచి 14వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొంది. దాదాపుగా ఇలాంటి పరిస్థితే మే 12, 13 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉంటుందని వెల్లడించింది.
ఇక అస్సాం, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. మే 11 నుంచి 16 వరకు ఈ పరిస్థితి ఉంటుందని తెలిపింది. బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది.
మధ్య, పశ్చిమ, దక్షిణ భారతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంతటా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక రాజస్థాన్, గుజరాత్తోపాటు మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని భారత వాతావరణ కేంద్రం వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో నిందితులు
కడప అల్మాస్పేట సర్కిల్ ఘటనపై అధికారులు సీరియస్..
For More Weather News And Telugu News