Share News

మైదాపిండికి ప్రత్యామ్నాయం

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:02 PM

సగ్గుబియ్యం, సాబుదానా, సాగో.. ఎలా పిలిచినా ఇవి ధాన్యం కాదు - తాజాగా తవ్విన కర్రపెండలం (కసావా) దుంపల్ని శుభ్రపరచి, చెరకు రసంలాగా పిండి, రసం తీసి కదల్చ కుండా ఉంచితే అడుగున గుజ్జు గట్టిపడు తుంది.

మైదాపిండికి ప్రత్యామ్నాయం

సగ్గుబియ్యం, సాబుదానా, సాగో.. ఎలా పిలిచినా ఇవి ధాన్యం కాదు - తాజాగా తవ్విన కర్రపెండలం (కసావా) దుంపల్ని శుభ్రపరచి, చెరకు రసంలాగా పిండి, రసం తీసి కదల్చ కుండా ఉంచితే అడుగున గుజ్జు గట్టిపడు తుంది. ఆ గుజ్జును జల్లెడలలోంచి పంపితే చిన్నచిన్న పూసల రూపంలో సగ్గుబియ్యం ఏర్పడతాయి.

కర్రపెండలానికి బ్రెజిల్‌ పుట్టిల్లు. అక్కడి తూపీ అనే భాషలో గట్టిపడే కర్రపెండలం గుజ్జుని ‘టిపియోకా’ అన్నారు. పోర్చుగీసులు దాన్ని ‘టపియోకా’గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆఫ్రికన్‌ భాషల్లో ‘సాగో’ అంటారు. సాగో బియ్యమే సగ్గుబియ్యం అయ్యాయి.

కర్రపెండలం శుభ్రపరిచే ప్రక్రియకు అధికంగా నీరు కావాలి. ఆ నీటిలో సయనైడ్‌ ఉంటుంది. దాన్ని సురక్షితంగా నిర్వహించటం నేటి పరిశ్రమల ముందు నిలిచిన పర్యావరణ సమస్య. అయినా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళల్లో సగ్గుబియ్యం పరిశ్రమలు ఉన్నాయి. ఆహార ప్రయోజనాలతో పాటు టపియోకా స్టార్చ్‌కు విస్తృత పారిశ్రామిక వినియోగం ఉంది. ఆహార పరిశ్రమలు, గ్లూకోజు, కాగితం, వస్త్రాలు, ఔషధాలు, ఐస్‌క్రీమ్‌, కోన్లు, చేపల ఫీడ్‌, రబ్బరు పరిశ్రమల్లో కర్రపెండలం గుజ్జు వాడకం ఉంది. నైజీరియా, బ్రెజిల్‌, థాయ్‌ లాండ్‌ దేశాలు కర్రపెండలం ఎగుమతుల్లో ముందున్నాయి.


మైదా నిష్ఫలమైన, నిస్సారమైన ద్రవ్యం. మనం జంక్‌ ఫుడ్స్‌గా భావించేవాటికి మూలం ఈ మైదాపిండే! ప్రత్యామ్నాయంగా కర్ర పెండలం (సగ్గుబియ్యం) పిండి- టపియోకా, మొక్కజొన్నపిండి, బార్లీపిండి వీటిని వాడటం గురించి మనం కొత్తగా ఆలోచన చేయాలి. గ్లూటెన్‌ కారణంగా మైదాపిండి సరిపడనివాళ్లు వంటింట్లోంచి దాన్ని ఎంత తప్పిస్తే ఆరోగ్యానికి అంత మంచిది.

తెలుపు, ఎరుపు, కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిపి వ్యాపారులు సగ్గుబియ్యాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. ప్రపంచానికి నీతులు చెప్పే విదేశీయులు రంగులు కలిపిన ఆహారపదార్థాల్ని మనకన్నా ఎక్కువగా వాడుతున్నారు. షెజువాన్‌ స్టిక్స్‌ లాంటి విదేశీ వంటకాలు తినేప్పుడు విషపు రంగుల గురించి ఆలోచించండి. విదేశీ వ్యామోహాన్ని వదులుకోవటమే దీనికి పరిష్కారం!


సగ్గుబియ్యం తేలికగా అరిగే ఆహారం. మైదా పిండితో పోలిస్తే అనేకరెట్లు ఆరోగ్యదాయకం! అల్సర్లు, ఎసిడిటీ, విరేచనాలు, అమీబియాసిస్‌ వ్యాధుల్లో మైదా తినొద్దు. సగ్గుబియ్యం తినాలి. జ్వరాలు, వడదెబ్బ, వాంతులు, విరేచనాల సమయంలో సగ్గుబియ్యం జావ (పారిడ్జి) శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఒక కప్పు జావలో సుమారు 544 క్యాలరీలు ఉంటాయి. షుగర్‌ వ్యాధి ఉన్నవారికి తప్ప అందరికీ ఇది మేలు చేసేదే!

ఆఫ్రికాలో కర్ర పెండలాన్ని చెక్కుతీసి, ముక్కలుగా చేసి ఓ కుండలో ఉంచి, మునిగే వరకూ నీళ్ళుపోసి 3 లేదా 4 రోజులపాటు నాన బెడతారు. అందువల్ల దుంప పులుస్తుంది. అప్పుడు ఎండబెట్టి పిండి కొట్టుకుంటారు. లేదా ఉడికించి కూరలు చేసుకుంటారు. కొద్దిగా నూనె వేసి దోరగా వేయించి కర్రపెండలం ముక్కల్ని నిలవబెట్టుకునే అలవాటు కూడా ఉంది.


సగ్గుబియ్యంతో అప్పడాలు, వడలు, వడి యాలు, బజ్జీలు తయారుచేస్తుంటారు. ‘సగ్గుపాయనం’ రుచికరంగానూ, శక్తిదా యకంగానూ ఉంటుంది. బంగాళదుంపలు, చేమదుంపలు ఇలాంటివి కొన్ని శరీరతత్వాలకు వాతపు నొప్పులు కలిగించే అవకాశం ఉంది. కానీ, సగ్గుబియ్యంతో ఇబ్బంది కలగదు.

సహజంగా ఇందులో పిండిపదార్థం తప్ప ఇతర పోషక పదార్థాలు ఏమీ లేనప్పటికీ పళ్ళ రసాలతోనూ, ఇతర కూరగాయల రసాలతోనూ కర్రపెండలం పిండిని కలిపినప్పుడు ఆ రసాలు చిక్కబడతాయి. సగ్గుబియ్యం కూడా కలుపుకోవచ్చు. చాలా దేశాల్లో దీనిని, ఆహారపదార్థాలు చిక్కబడేలా చేసేందుకు వాడుతుంటారు. గోధుమల్ని, సగ్గుబియ్యాన్ని కలిపి మర పట్టించుకుంటే చపాతీలు, పుల్కాలు మరింత మృదువుగా ఉంటాయి.

కర్రపెండలం గుజ్జుని గాని, సగ్గుబియ్యాన్ని గాని బాగా ఉడికించిన తర్వాతే తినాలి. కర్రపెండలం పైన ఉండే పెచ్చుని తప్పని సరిగా తొలగించాలి.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

మావిగన్‌.. మారీచ!

సీఎస్ఆర్‌ ఫండ్‌ పెరగాలి!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2026 | 12:02 PM