Share News

సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు: కొండా మురళి

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:56 PM

సుస్మితకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందని కాంగ్రెస్‌ నేత కొండా మురళి స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, సుస్మితను ప్రశ్నించే హక్కు తమకు లేదని కొండా మురళి పేర్కొన్నారు.

సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు: కొండా మురళి
Konda Murali On Sushmita comments

హైదరాబాద్‌: సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను ఎలాంటి చర్చ చేయలేదని కాంగ్రెస్‌ నేత కొండా మురళి స్పష్టం చేశారు. సుస్మితకు స్వతంత్రంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని తెలిపారు. ఆమె వ్యాఖ్యలపై ప్రశ్నించే హక్కు తమకు లేదన్నారు.


సుస్మిత తనకు నచ్చినట్లు తాను ఉంటుందని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని కొండా మురళి పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని అన్నారు. ‘మా బిడ్డ చేసిన వ్యాఖ్యలతో మాకేం సంబంధం?’ అని వ్యాఖ్యానించారు. కమిటీకి చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే వివరించామని తెలిపారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కొండా మురళి స్పష్టం చేశారు.

కాగా, వరంగల్‌ జిల్లా పరకాలలో కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్‌రెడ్డి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తూ.. తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. సుస్మిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అలాగే సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని పీసీసీ నిర్ణయించింది. అయితే, సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని కొండా సురేఖ స్పష్టం చేశారు.


Also Read:

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి

ధరణితోనే అనేక భూ సమస్యలు.. గత ప్రభుత్వంపై వీహెచ్ ఫైర్

Updated Date - Aug 26 , 2026 | 03:33 PM