Share News

సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ABN , Publish Date - Jan 21 , 2026 | 06:45 PM

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి భూముల్లో అనేక ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే చర్యలకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy Singareni comments

హైదరాబాద్: తెలంగాణకు గుండెలాంటి సింగరేణి.. ఇప్పుడు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని బంగారుబాతులా కాంగ్రెస్‌ వాడుతోందన్నారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు బొగ్గు అందించాలని.. కేంద్రం నైనీ కోల్‌ బ్లాక్‌ను కేటాయించిందని, కోల్‌ బ్లాక్‌కు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేశారు. అయితే, టెండర్లు పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నాన్చుతోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. టెండర్లు రద్దు చేయడమంటే సింగరేణికి అన్యాయం చేసినట్లేనన్నారు.


నిబంధన పెట్టడమేంటి?

సైట్‌ విజిట్‌కు.. సింగరేణి సర్టిఫికెట్‌ ఇవ్వాలనే నిబంధన పెట్టారని, అయితే సైట్‌ విజిట్‌ అనేది సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ నిబంధనని పేర్కొన్నారు. కానీ.. సింగరేణి సర్టిఫికెట్‌ ఇవ్వాలనే నిబంధన పెట్టడమేంటి? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. నచ్చినవారికి నైనీ కోల్‌ బ్లాక్‌ ఇవ్వాలని చూస్తున్నారన్నారు. గతంలో BRS, ఇప్పుడు కాంగ్రెస్‌ సింగరేణిని వాడుకుంటున్నాయని, లాభాల బాటిలో ఉన్న సింగరేణిని సమస్యల నిలయంగా మార్చారని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నచ్చిన వారికి విజిట్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

పెత్తనం రాష్ట్రానిదే

సింగరేణిలో కేంద్రం వాటా 49%.. కానీ పెత్తనం రాష్ట్రానిదని విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన అధికారం లేదని, ఏడుగురు డైరెక్టర్లలో కేంద్రం నుంచి ఇద్దరే ఉంటారని తెలిపారు. సీఎండీ నియామకం కూడా రాష్ట ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ఆడిందే ఆటగా కొనసాగిందని, రాజకీయ జోక్యంతో సింగరేణిని సమస్యల్లోకి నెట్టివేశారని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల చెమట, రక్తాన్ని దోచుకుంటున్నారని అన్నారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరపాలంటున్నారని అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా కావాలని తెలిపారు. ఈ వివాదంలోకి అనవసరంగా తనను లాగుతున్నారన్నారు.


సీబీఐ దర్యాప్తు జరగాలి

బీఆర్ఎస్ హయాంలోనూ అనేక అక్రమాలు జరిగాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌, BRS సింగరేణిని విధ్వంసం చేస్తున్నాయన్నారు. అక్రమ లావాదేవీలు, తెరవెనుక ఒప్పందాలు.. సింగరేణి భవిష్యత్‌ను ప్రమాదంలో పడేస్తున్నారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే.. సింగరేణి వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. గతంలో తాడిచర్ల కోల్‌ బ్లాక్‌ను కేంద్రం జెన్‌కోకు కేటాయించిందని, మైనింగ్‌ చేస్తామని సింగరేణి ముందుకొస్తే BRS బెదిరించిందన్నారు. తాము మైనింగ్‌ చేయబోమని బలవంతంగా లేఖ ఇప్పించిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్‌ సంస్థలకు వెళ్లేలా నాడు BRS వ్యవహరించిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే పంథా కొనసాగిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణిని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

రూ.47 వేలకోట్ల బకాయిలు ఎప్పుడిస్తారు?

నైనీ కోల్‌ బ్లాక్‌ విషయంలోనే కాకుండా.. పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే సీబీఐ దర్యాప్తుపై కేంద్రం పరిశీలిస్తుందన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47 వేలకోట్ల బకాయిలు చెల్లించాలని, ఆ బకాయిలు ఎప్పుడిస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు క్వాలిటీ తగ్గిపోయిందన్నారు. సింగరేణి బొగ్గును చాలా రాష్ట్రాలు వద్దంటున్నాయని, సింగరేణి సంస్థ ఉనికే ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. సింగరేణి భూముల్లో అనేక ఆక్రమణలు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే చర్యలకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


Also Read:

తెలంగాణకు 1,000 కోట్ల పెట్టుబడులు.. దావోస్‌లో సర్కార్ కీలక ఒప్పందం

ప్రేమజంటను కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 07:40 PM