ఆర్టీసీ సమ్మెలో ఆందోళనకర పరిణామాలు..
ABN , Publish Date - Apr 23 , 2026 | 08:33 PM
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపోలో డ్రైవర్ వెంకన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపోలో డ్రైవర్ వెంకన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ చర్యకు దిగినట్లు సమాచారం. అయితే వెంటనే అప్రమత్తమైన తోటి ఉద్యోగులు ఆయనను అడ్డుకుని పెద్ద ప్రమాదం తప్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. MGM వైద్యులు శంకర్గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా వివరాలు వెల్లడించారు. ఆయనకు 60 నుంచి 80 శాతం వరకు కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్కు తరలించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో RTC కార్మికుల సమ్మె కారణంగా రెండో రోజు కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఉద్యోగులు, దినసరి కూలీలు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి రావడంతో ప్రయాణికులు అధిక ఛార్జీల భారాన్ని మోస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్
కేసీఆర్పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News