పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Jun 28 , 2026 | 07:48 PM
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పనులు, గత ప్రభుత్వాలపై ఆరోపణలు, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.
నల్లగొండ, జూన్ 28: 'మొన్న టీఆర్ఎస్, నిన్న బీఆర్ఎస్.. ఇలా పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా?' అంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కోమటి రెడ్డి.. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, గత పాలనలో జరిగిన అవినీతి, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బయటికి వెళ్లిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లను నిర్మిస్తోందని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులను ఉద్దేశించి విమర్శలు చేసే వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తూ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాళేశ్వరం, ధరణి వంటి పేర్లతో గతంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి.. రాష్ట్ర వనరులు దుర్వినియోగం అయ్యాయన్నారు. తరచూ పార్టీలు మారుతూ విమర్శలు చేసే వారికే తాము సమాధానం చెప్పాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు విషయంపైనా ఆయన స్పందించారు. కుర్చీ వేసుకుని సొరంగం పూర్తి చేస్తానని గతంలో చెప్పిన కేసీఆర్.. ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. పనుల సమయంలో జరిగిన ప్రమాదాల్లో కార్మికుల మరణాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. అయితే ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, 2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన పనులకు అడ్డుపడుతున్నారని పేర్కొంటూ కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డిలపై ఆయన విమర్శలు చేశారు. నకిరేకల్లో ప్రవహించే మురికి మూసీని వారు స్వయంగా చూడాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..
బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News