బెంగళూరులో సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:36 PM
భర్త గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి కొన్ని నిమిషాలకే అతడి భార్య అపార్ట్మెంట్లోని 17వ అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
బెంగళూరు, మార్చి 31: భర్త గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి కొన్ని నిమిషాలకే అతడి భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కె.భానుచందర్ రెడ్డి(32), బీబీ షాజియా సిరాజ్(31) వివాహం చేసుకుని బెంగళూరులో నివసిస్తున్నారు. బీబీ షాజియా సిరాజ్ కూడా ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. సోమవారం భర్త భానుచందర్ రెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. భార్య ఎంత కొట్టినా తలుపు తెరవ లేదు. దాంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టింది.
ఇంతలో గదిలో భర్త భానుచందర్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. అనంతరం బీబీ షాజియా కూడా అపార్ట్మెంట్ 17వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అపార్ట్మెంట్ వాసులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. భానుచందర్ రెడ్డి దంపతుల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. వారి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అధిక ఒత్తిడి, అనారోగ్యం, మానసిక సమస్యలు తదితర కారణాలేమైనా అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పోస్ట్మార్టం నివేదిక వస్తే తప్ప ఈ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని పోలీసులు వివరించారు. మరోవైపు మృతుల తల్లిదండ్రులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. వీరి మృతితో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు
తుంగభద్ర డ్యామ్ గేట్ల పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్
Read Latest Telangana News And Telugu News