స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు..
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:42 PM
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సిద్ధాపూర్ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందాడు.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలోని సిద్ధాపూర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందాడు. ఇవాళ (మంగళవారం) సాయంత్రం పాఠశాల సమయం ముగియడంతో చిన్నారులను తీసుకుని స్కూల్ బస్సు బయలుదేరింది. విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపుకుంటూ సిద్ధాపూర్ కాలనీకి చేరుకుంది. బస్సు రాగానే తన అన్నయ్య ఇంటికి తీసుకెళ్లేందుకు ఎఫ్రాయిమ్(2) రోడ్డుపైకి వెళ్లాడు.
రోజూ లాగానే తన సోదరుడిని ఇంట్లోకి తీసుకెళ్లి సంతోషంగా ఆడుకోవాలని అనుకున్నాడు. అయితే, అదే అతని ప్రాణాలను బలి తీసుకుంది. బస్సు వద్దకు చిన్నారి ఎఫ్రాయిమ్ వెళ్లగానే ప్రమాదవశాత్తూ టైర్ కిందపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలుడు విలవిల్లాడుతూ క్షణాల్లోనే మృతిచెందాడు. చిన్నారి కేకలు విన్న తల్లిదండ్రులు ఇంటి నుంచి రోడ్డుపైకి పరిగెత్తారు. విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి గుండెలు పగిలేలా రోదించారు. మరోవైపు, తమ కళ్ల ముందే చిన్నారి మృతిచెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సిద్ధాపూర్కి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, చిన్నారి మృతితో సదాశివపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కు ఊరట..
గౌరవ సభను కౌరవ సభగా మార్చుతున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు