కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:35 PM
కాళేశ్వరం విషయంలో బిఆర్ఎస్ పార్టీ బూటకపు ప్రచారం చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నెపల్లి పంపు హౌస్కు18 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. అన్నారం బ్యారేజ్కి రంధ్రాలు ఉన్నాయని CWPRS రిపోర్ట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
న్యూఢిల్లీ, జులై 29: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి చుక్క కూడా వాడకుండా భారతదేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన వారం రోజుల్లోనే లీక్ అయిందన్నారు. ఈ విషయం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కి కూడా తెలుసునని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి సహా అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. సుమారు మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్ల వడ్డీ రూపంలో కడుతున్నామని వివరించారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ పార్టీ పిచ్చి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కానీ ఆ ప్రాజెక్ట్తో తాము అలాంటి రాజకీయాలు చేయడం లేదన్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. ఇసుకలో కాళేశ్వరం ఫౌండేషన్ వేశారని గుర్తు చేశారు. ఐఐటీ బాంబే ఆఫ్రి కంపెనీతో సాయిల్ టెస్ట్ చేయించామని పేర్కొన్నారు. బ్యారేజీలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని.. అంటే అది ఓపెన్ చేస్తే ప్రజలకు ఏమైనా అయితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కక్కుర్తి, అసమర్థత వలన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. అయితే కాళేశ్వరం విషయంలో తమకు రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం విషయంలో బిఆర్ఎస్ పార్టీ బూటకపు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నెపల్లి పంపు హౌస్కు18 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. అన్నారం బ్యారేజ్కి రంధ్రాలు ఉన్నాయని CWPRS రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు. NDSA మొదట ప్రిలిమినరీ రిపోర్ట్ నవంబర్ 23 ఇచ్చిందని అన్నారు. కమీషన్ల కోసం ఫౌండేషన్ చూసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు రూ. 1400 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లు చెక్ రూపంలో ఇచ్చారని కల్వకుంట కవిత చెప్పారని..అది వాస్తవమని పేర్కొన్నారు.
తనకు తెలిసి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా మేఘా సంస్థకు ఇవ్వలేదన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీబీఐకి లేఖ రాశామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 24 గంటల్లో సీబీఐ విచారణ జరిపిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్ట్ చేస్తామన్నారు. SLBC టన్నులు తమ హయంలో పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టబ్లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్
చిన్నారి విన్యాసాలు.. సైనికుల ఫిదా.. వీడియో వైరల్
For More TG News And Telugu News