ఆస్పత్రి నుంచి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:14 PM
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసులో ఉదయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, జులై 22: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసులో ఉదయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఉదయ్ ఈరోజు(బుధవారం) డిశ్చార్జ్ అయ్యారు. ఉదయ్ పేరుతో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆయన కోలుకున్న తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేవేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఉదయ్ కృష్ణారెడ్డి ఆశ్రయించారు. ట్రైనీ ఐపీఎస్ క్వాష్ పిటిషన్పై సోమవారం(జులై 27) విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది.
కాగా, హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులకు సంబంధించి అత్తాపూర్లో నమోదైన కేసును ఉమెన్ సేఫ్టీ వింగ్కు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఉన్నతాధికారుల నిర్ణయంతో తదుపరి దర్యాప్తును షీటీమ్స్కు అప్పగించారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో జాతీయ పోలీస్ అకాడమీకి చేరుకున్న షీటీమ్స్ డీసీపీ.. మహిళా ట్రైనీ ఐపీఎస్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. పోలీసు అధికారుల సమక్షంలో స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండ: కవిత
అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి
Read Latest Telangana News And Telugu News