Share News

బీఆర్‌ఎస్ హయాంలో మౌనం ఎందుకు?... కేటీఆర్‌కు తెలంగాణ జనసేన సూటి ప్రశ్నలు

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:55 PM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌‌కు తెలంగాణ జనసేన సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించింది. విద్యార్థుల నిజమైన ఆందోళనలు.. అశాంతిని సృష్టించాలనుకునే శక్తులకు వేదికకాకూడదని వెల్లడించింది.

బీఆర్‌ఎస్ హయాంలో మౌనం ఎందుకు?... కేటీఆర్‌కు తెలంగాణ జనసేన సూటి ప్రశ్నలు
Telangana Janasena

హైదరాబాద్, జులై 23: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌‌కు తెలంగాణ జనసేన సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించింది. ఇటీవల కేటీఆర్.. యువ సంగ్రామ సదస్సులో పాల్గొని విద్యార్థులు, నిరుద్యోగుల గురించి మాట్లాడటంపై టీ.జనసేన స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు న్యాయం జరగాలని తాము కూడా కోరుకుంటామని పేర్కొంది. విద్యార్థుల నిజమైన ఆందోళనలు.. అశాంతిని సృష్టించాలనుకునే శక్తులకు వేదికకాకూడదని వెల్లడించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. నిరుద్యోగ అభ్యర్థుల కలలను చిన్నాభిన్నం చేసిందని విమర్శించింది. 2019 ఇంటర్మీడియట్ పరీక్షల గందరగోళంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని... మీ సొంత ప్రభుత్వంలోనే ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు ఎందుకు మౌనం వహించారని కేటీఆర్‌‌ను తెలంగాణ జనసేన ప్రశ్నించింది.


తెలంగాణ జనసేన పోస్ట్..

‘కేటీఆర్‌.. విద్యార్థులకు న్యాయం జరగాలని మేము అంగీకరిస్తున్నాము. పరీక్షల్లో అవకతవకల వల్ల భవిష్యత్తు దెబ్బతిన్న ప్రతి విద్యార్థికి జనసేన అండగా నిలుస్తుంది. శాంతియుత, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా జవాబుదారీతనం కోరుతున్న విద్యార్థులకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము. అదే సమయంలో, విద్యార్థుల నిజమైన ఆందోళనలు.. అశాంతిని సృష్టించాలనుకునే శక్తులకు ఎన్నడూ వేదిక కాకూడదు. కానీ ఇటీవలి 'యువ సంగ్రామ సదస్సు' , నేటి సంఘీభావ ప్రకటనలు ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. BRS party అధికారంలో ఉన్నప్పుడు ఈ గొంతు ఎక్కడ ఉంది? 2019 ఇంటర్మీడియట్ పరీక్షల గందరగోళం, ఫలితాలలో విస్తృతమైన తప్పులు, పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలతో లక్షలాది మంది విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశం.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి చదువుకున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కలలను చిన్నాభిన్నం చేసింది. మీ సొంత ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు మౌనం వహించి, ప్రతిపక్షంలో ఉండి విద్యార్థుల పక్షాన మాట్లాడటం నిలకడైన నిబద్ధత కన్నా రాజకీయ సౌలభ్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది. అధికారంలో ఎవరున్నా సరే, మేము ప్రతి విద్యార్థికి అండగా నిలుస్తాము. ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.. జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తాం’ అంటూ ఎక్స్‌లో తెలంగాణ జనసేన పోస్ట్ చేసింది.


ఇవి కూడా చదవండి...

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:09 PM