రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక: రిటర్నింగ్ అధికారి
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:26 PM
తెలంగాణ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో ప్రకటించారు.
హైదరాబాద్, మార్చి 09: తెలంగాణ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వేం నరేంద్ర రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఆయన వివరించారు. అందుకు సంబంధించిన పత్రాలను కాసేపట్లో వీరికి అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పత్రాలను అందుకోవడానికి అభిషేక్ మను సింఘ్వీ తరఫున అడ్వకేట్ సుందర్ చౌహాన్ తెలంగాణ అసెంబ్లీలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే మరికాసేపట్లో వేం నరేందర్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయానికి రానున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు.
రాజ్యసభలో పలువురి సభ్యుల పదవి కాలం ఏప్రిల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసింది. గురువారంతో నామినేషన్ల ప్రకియ ముగిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి వీరు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక.. సాయి అనే వ్యక్తి సైతం ఈ రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అతడి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో.. శుక్రవారం ఆ నామినేషన్ను తిరస్కరించారు. అలాగే ఇతరులు ఎవ్వరూ నామినేషన్ల దాఖలు చేయలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి నామినేషన్ల దాఖలు చేసిన అభిషేక్, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం.. రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
ఈడీ విచారణకు కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్ను చూడగానే పరుగో పరుగు
Read Latest TG News And Telugu News