గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ: మంత్రి దామోదర రాజ నర్సింహా
ABN , Publish Date - Jul 14 , 2026 | 07:59 PM
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో దశలవారీగా సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
హైదరాబాద్, జులై14: రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మంగళవారం హైదరాాబాద్ సెక్రటేరియట్లో కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులతో ఆయన వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో దశలవారీగా సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
అవసరమైన చోట కొత్త సబ్ సెంటర్లతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఏర్పాటు చేస్తామని చెప్పారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల అప్గ్రేడ్కు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందులో సిటీ స్కాన్ సేవలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కొత్తగూడెం సహా అటవీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి మండలానికి అంబులెన్స్.. సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులకూ అంబులెన్స్లు కేటాయిస్తామని చెప్పారు. జిల్లాలో కొత్తగా మరో నాలుగు డయాలసిస్ సెంటర్ల మంజూరు చేస్తామని తెలిపారు. 20 నిమిషాల్లో డయాలసిస్ సెంటర్ చేరేలా నెట్వర్క్ విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. పట్వారిగూడెం, అన్నపెరటిపల్లి పీహెచ్సీల అప్గ్రేడ్కు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
గండుగులపల్లిలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొమురారం ఆసుపత్రి అప్గ్రేడ్.. ఇల్లందులో కొత్త ఐసీయూ ఏర్పాటు చేస్తామని వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల అటెండెన్స్ను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా
నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి.. రైతులకు మంత్రి తుమ్మల సూచన
For More TG News And Telugu News