సమ్మె విరమించండి.. ఆర్టీసీ కార్మికులకు పొన్నం సూచన
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:28 PM
టీజీఎస్ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను వెంటనే విరమించాలని వారికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మీ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మికులకు ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్21: టీజీఎస్ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను వెంటనే విరమించాలని వారికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మీ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మికులకు ఆయన స్పష్టం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంధానకర్తగా ఉంటే.. ఇప్పటికిప్పుడు చర్చకు తాము సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు వద్దంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొనడం బాధాకరమన్నారు. హైడ్రాను రద్దు చేస్తామంటే కబ్జాదారులకు మద్దతు ఇవ్వడమేనని మంత్రి పొన్నం అభిప్రాయపడ్డారు.
జగిత్యాలలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ భారీ సభను నిర్వహించింది. ఈ సభకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రానున్నది తమ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మీ వద్దని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొనడం పట్ల పొన్నం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఆ సభలు: రాంచందర్ రావు
ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి
For More TG News And Telugu News