ఖరీఫ్ పంటలు గట్టెక్కేనా?
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:08 AM
ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు.
ప్రస్తుత వానాకాలం సీజన్లో మిగిలింది ఒకే నెల
గత 3 నెలల్లో రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం
సెప్టెంబరులోనూ వానలు పడకపోతే కష్టమే
పడిపోనున్న వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడి
ఇకపై వరి నాట్లు వేయొద్దని శాస్త్రవేత్తల సూచన
ఎల్నినోతో దేశవ్యాప్తంగా వరిసాగులో తగ్గుదల
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. చిరు జల్లులు ఊరిస్తున్నా జలాశయాల్లోకి వరదనీరు వచ్చే పరిస్థితులు కనిపించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో రాష్ట్రంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో గడిచిన మూడు నెలల్లో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలే కీలకం. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. ఇప్పటికే లోటు ఉండటంతో సెప్టెంబరులో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావాలి. అప్పుడే పంటలు గట్టెక్కుతాయని రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 3 నెలల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ కాగా... కురిసింది 473.8 మి.మీ మాత్రమే. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా... 134.5 మి.మీలు నమోదైంది. అంటే 38 శాతం లోటు. సెప్టెంబరులో కూడా వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత పడిపోయి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై వరిపంట వేయవద్దని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసినా పంట దిగుబడి ఆశించినంతగా రాదని చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన వరి పంటలో కూడా దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 66 లక్షల ఎకరాలు కాగా... ఈ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల ఎకరాల్లో వేశారు. అంటే 33 శాతం తగ్గిపోయింది. పత్తి పంట విస్తీర్ణం మాత్రం సాధారణం కంటే 2 శాతం అధికంగా ఉంది. పత్తి సాధారణ విస్తీర్ణం 47,41,541 ఎకరాలు కాగా... ఈసారి 48,21,503 ఎకరాల్లో సాగుచేశారు. అయితే, ఈ పంట కూడా పూర్తిగా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. ఒకటిరెండు సార్లు పత్తి తీసేవరకే ఇప్పుడున్న సాగునీరు సరిపోతుందని చెబుతున్నారు. దీంతో ఈసారి పత్తి దిగుబడి తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6.17 లక్షల ఎకరాలకు గాను, 5.90 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు సమృద్ధిగా లేకపోవటంతో మొక్కజొన్న కంకులు చిన్న పిందెల్లా కనిపిస్తున్నాయి. వర్షాభావంతో దేశవ్యాప్తంగా కూడా వరి సాగు విస్తీర్ణం ఈ సీజన్లో 3.35 శాతం తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత సంవత్సరం ఇదే సీజన్లో 428.46 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా, ఈసారి 414.10 లక్షల హెక్టార్లకే పరిమితమైందని తెలిపింది. కర్ణాటక, తెలంగాణ, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పడిపోయిందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మజ్లిస్ అదుపులోనే రహ్మత్ బేగ్!