ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 26 , 2026 | 10:28 AM
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో 13 మంది మృతిచెందడం, 20 మందికి తీవ్రగాయాలు కావడంపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో 13 మంది మృతిచెందడం, 20 మందికి తీవ్రగాయాలు కావడంపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
నిర్మల్ నుంచి నెల్లూరు వైపు బస్సు వెళుతున్న నేపథ్యంలో మృతిచెందిన, గాయపడిన వారి వివరాలను తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని ఆజ్ఞాపించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ సీఎస్ సాయిప్రసాద్తో ఆయన మాట్లాడారు. ప్రమాదం గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఇవాళ(గురువారం) తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం నిర్మల్ నుంచి ఏపీలోని నెల్లూరు వైపునకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్దకు రాగానే కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమవ్వగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, సవిత, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు సహా పలువురు స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్ని అదుపులోకి తీసుకున్న సిట్
భవనంపై నుంచి దూకి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి