Share News

తలసేమియా బాధితులకు పింఛన్లు

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:24 AM

రాష్ట్రంలోని తలసీమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. వెంటనే అర్హులను గుర్తించి, ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని నిర్దేశించారు.

తలసేమియా బాధితులకు పింఛన్లు

  • సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడేవారికి కూడా.. ఆగస్టు 15 నుంచి పంపిణీ

  • వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పెన్షన్లు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. వెంటనే అర్హులను గుర్తించి, ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని నిర్దేశించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని, ఎటువంటి జాప్యానికి తావివ్వొద్దని చెప్పారు. మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్థి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా చూడాలన్నారు. 45 రోజులకు ఒకసారి మండల పరిషత్‌ సమావేశాలు నిర్వహించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలో తారు రోడ్డు లేని ఊరు ఉండకూడదన్నారు. ప్రతి పంచాయతీకీ కార్యాలయం నిర్మించాలన్నారు. పంచాయతీల్లో జనాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా వర్గీకరించి భవనాలు నిర్మించాలని చెప్పారు.


రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలకు పారిశుద్ధ్య, ఇతర పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో ఉండాలని సూచించారు. డిజైన్ల రూపకల్పనకు ఎన్‌ఐఎఫ్‌టీ విద్యార్థులను వినియోగించుకోవాలని తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, మెట్రో వాటర్‌, సాగు నీటి శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. గ్రామీణ తాగు నీటి పథకాల పరిధిలో పనిచేసేవారికి 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని చెప్పారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్‌, పీఆర్‌ అండ్‌ ఆర్డీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ దానకిశోర్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సీఈవో సెర్ప్‌ దివ్య దేవరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇవీ చదవండి:

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..

అదే జోరు.. వాన హోరు

Updated Date - Jul 31 , 2026 | 07:36 AM