Share News

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:31 AM

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. ఇవాళ (2026 జులై 31) అర్ధరాత్రి 12:51 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..
Peddi Sudarshan Reddy passed away

వరంగల్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. ఇవాళ (2026 జులై 31) అర్ధరాత్రి 12:51 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈనెల 26న హనుమకొండలోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను రోహిణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అత్యవసర చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.


పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం) కారణంగా గుండె ఆగిపోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ, నాడీవ్యవస్థ స్పందన లేకపోవడంతో పరిస్థితి విషమించింది. ఆరు రోజుల పాటు యశోద ఆస్పత్రి వైద్యులు మాజీ ఎమ్మెల్యే ప్రాణాలను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని యశోద ఆస్పత్రి యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.


కాగా, ఈరోజు ఉదయం 7 గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహాన్ని నర్సంపేటకు తరలించనున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత నర్సంపేటకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి భౌతికకాయాన్ని తరలించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు. అంతిమయాత్ర సజావుగా జరిగేలా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, ప్రజలందరూ సహకరించాలని ఎర్రబెల్లి దయాకర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు, సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇంజనీరింగ్‌ విద్య క్రిమినల్‌ వేస్ట్‌!

ఒడువని వాన

Updated Date - Jul 31 , 2026 | 06:44 AM