సీఎం రేవంత్రెడ్డికి టీబీజేపీ చీఫ్ రాంచందర్రావు కౌంటర్
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:19 PM
సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అడ్డుకుంటామన్న వ్యాఖ్యలను ఖండించిన ఆయన, బీజేపీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని పొలిమేర దాటనివ్వమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. 'కిషన్రెడ్డిని ఆపుతామని అంటున్నారు.. మమ్మల్ని అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మేం తలుచుకుంటే మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తాం. మా నాయకుల జోలికి వస్తే బీజేపీ శక్తి ఏంటో చూపిస్తాం' అంటూ రాంచందర్రావు హెచ్చరించారు.
రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల మేర సహాయం అందిందని పేర్కొన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, కొంతమంది కాంగ్రెస్ నేతలు రైతుల భూములను కాజేస్తున్నారని ఆరోపించారు. రైతుల నుంచి భూములు సేకరించే ముందు తగిన పరిహారం చెల్లించాలని, పరిహారం ఇవ్వకుండానే ఫ్రూట్ మార్కెట్కు శంకుస్థాపన చేయడం సరైందికాదని విమర్శించారు. రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, రైతుల ప్రయోజనాలను కాపాడే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని రాంచందర్రావు స్పష్టం చేశారు.
Also Read:
టీజీ 20 లీగ్: మెదక్కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?
కేవలం 45 పైసలతో రూ.10 లక్షల బీమా.. IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్