లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నడిపితే కఠిన చర్యలు: అడిషనల్ డీజీ
ABN , Publish Date - Jun 17 , 2026 | 08:32 PM
లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాటి యజమానులను ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ హెచ్చరించారు.
హైదరాబాద్, జూన్17: లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాటి యజమానులను ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం లక్డీకాపూల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో సెక్యూరిటీ ఏజెన్సీల యజమానులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. లైసెన్స్ లేని ఏజెన్సీలపై భారీ జరిమానాలతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సెక్యూరిటీ గార్డుకు పోలీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
21 రోజుల బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారినే విధుల్లోకి తీసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థల యజమానులను అడిషనల్ డీజీ ఆదేశించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులను నియమించ వద్దని పేర్కొన్నారు. కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర కార్మిక హక్కులు తప్పనిసరిగా అమలు చేయాలని వారికి సూచించారు. కార్మిక నిబంధనల అమలుపై లేబర్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలీసులకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కళ్లు, చెవులుగా పని చేయాలని స్పష్టం చేశారు.
అనుమానాస్పద వ్యక్తులు, సంఘ విద్రోహ కార్యకలాపాల సమాచారం అందితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అడిషనల్ డీజీ విజయ్ కుమార్ ఆదేశించారు. లైసెన్స్ రిన్యువల్, ఆన్లైన్ పోర్టల్, కార్మిక నిబంధనలు, వారి సమస్యల పరిష్కారిస్తామని ఏజెన్సీల యజమానులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా పని చేసే సెక్యూరిటీ ఏజెన్సీలకు పోలీస్, ఇంటెలిజెన్స్, లేబర్ శాఖల పూర్తి సహకారం అందిస్తుందని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ముహూర్తం ఫిక్స్
వైసీపీ నేతల మాటలే వారికి సమాధి రాళ్లు: మంత్రి కొల్లు రవీంద్ర
For More TG News And Telugu News