చట్టం అనే ముసుగులో కేంద్రం తీసుకొచ్చిన దొంగ దారి ఎస్ఐఆర్: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jun 12 , 2026 | 02:40 PM
ఎస్ఐఆర్ (SIR) ఆనేది భయంకరమైన ఒక భూతమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. చట్టం అనే ముసుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దొంగ దారి ఎస్ఐఆర్ (SIR) అని తెలిపారు.
ఖమ్మం, జూన్12: ఎస్ఐఆర్ (SIR) ఆనేది భయంకరమైన ఒక భూతమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. చట్టం అనే ముసుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దొంగ దారి ఎస్ఐఆర్ (SIR) అని తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదులాపురంలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అధికారులు ముందు ఓటు మ్యాపింగ్ చేస్తారని పేర్కొన్నారు. గ్రామంలో ఓట్లు తొలగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ బూత్ లెవల్ ఏజంట్లకు ఆయన స్పష్టం చేశారు. వివిధ కారణాలతో ఓట్లు తొలగిస్తారని బూత్ లెవల్ ఏజంట్లను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రాంతాల్లో ఓటర్ లిస్టు పేరుతో ఓట్లు తొలగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్ఐఆర్ ద్వారా రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను కేంద్రం ఓడించిందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఓట్ల తొలగింపును తిప్పి కొట్టాల్సిన బాధ్యత బీఎల్ఏలదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానం కాపాడుకుంటే చాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లబ్ధి పొందాలని చూస్తే.. దానిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిాపారు. రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్కు టికెట్ ఇస్తే బీజేపీ గెలవదని తెలిసి కూడా ఆ పార్టీ అభ్యర్థిని పెట్టిందని చెప్పారు.
తెలంగాణాలో ఎఫ్ఐఆర్ ఉందని అన్యాయంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఇంతకు ముందు ఓట్లు దొంగిలించారని.. ఇప్పుడు సీట్లు దొంగిలించారని బీజేపీ తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. సీబీఐ, ఈడీ పేరుతో గెలిచిన వారిని.. వారి వైపు తిప్పుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చూస్తుందని మండిపడ్డారు.
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి మనమందరం అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సైనికుడిలా కష్టపడి ఓటు పోగొట్టకుండా జాగ్రత్త పడాలని బీఎల్ఏలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తీర్థయాత్రల స్పెషల్ ప్యాకేజీలతో ఆర్టీసీకి ఆదాయం
Read Latest Telangana News And Telugu News