పీసా చట్టం.. ఆదివాసీల నిర్ణయాధికారానికి రక్షణ కవచం: మంత్రి సీతక్క
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:09 PM
పీసా చట్టం ఆదివాసీల స్వాభిమానానికి ప్రతీక అని మంత్రి సీతక్క అన్నారు. గ్రామసభలను బలోపేతం చేసి గిరిజన హక్కులను కాపాడాలన్నారు.
హైదరాబాద్, జూన్ 10: పీసా చట్టం ఆదివాసీల స్వాభిమానానికి ప్రతీక అని మంత్రి సీతక్క అన్నారు. గ్రామసభలను బలోపేతం చేసి గిరిజన హక్కులను కాపాడాలన్నారు. ఈరోజు(బుధవారం) రాజేంద్రనగర్లో పీసా చట్టం అమలుపై రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్షాప్ను మంత్రి ప్రారంభించి... ప్రసంగించారు. పీసా చట్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు పూర్తి అవగాహన అవసరమని తెలిపారు. పీసా కేవలం చట్టం కాదని.. ఆదివాసీల స్వయం నిర్ణయాధికారానికి రక్షణ కవచమని వెల్లడించారు.
పేద వారి కోసం పనిచేయడమే ప్రజాసేవ..
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని.. గ్రామసభలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని మంత్రి తెలిపారు. సహజ వనరులపై గ్రామసభల నిర్ణయాధికారాన్ని పీసా చట్టం కల్పించిందన్నారు. చట్టం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి కార్పొరేట్ల చేతుల్లోకి సహజ వనరులు వెళ్లకూడదన్నారు. పీసా చట్ట స్ఫూర్తిని అర్థం చేసుకుని అమలు చేసినప్పుడే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సర్పంచులు గ్రామాభివృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి గ్రామసభల బలోపేతంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గిరిజన హక్కుల పరిరక్షణ తనకు ప్రత్యేక బాధ్యతగా చెప్పుకొచ్చారు. ఉన్నవారి కోసం కాదు.. లేని వారి కోసం పనిచేయడమే ప్రజాసేవ అని అన్నారు.
పీసా అమలు పుస్తకాలకే పరిమితం కాకూడదు..
గిరిజన ప్రాంతాల్లో ఇంకా ప్రాథమిక సదుపాయాల కొరత ఉందని సీతక్క వెల్లడించారు. గుట్టలు కరిగిపోతున్నాయని.. సహజ వనరులు క్షీణిస్తున్నాయన్నారు. గ్రామ పంచాయతీలు, గ్రామసభలను మరింత బలోపేతం చేయాలన్నారు. పీసా అమలులోని సవాళ్లకు వర్క్షాప్ చర్చలు పరిష్కార మార్గాలు చూపాలని తెలిపారు. ‘సర్పంచ్ సంవాద్’ ద్వారా 4,500 మంది సర్పంచులు ఒకే వేదికపైకి వచ్చారన్నారు. సాంకేతికతతో గ్రామీణ పాలనను మరింత సమర్థవంతం చేస్తున్నామని తెలిపారు. పీసా అమలు పుస్తకాలకే పరిమితం కాకూడదని.. గ్రామస్థాయిలో ఫలితాలు కనిపించాలన్నారు. ఆదివాసీల స్వపరిపాలన స్ఫూర్తిని కార్యరూపంలోకి తీసుకురావాలని తెలిపారు. పీసా చట్టం అమలుకు గ్రామసభల నిర్ణయాలకు గౌరవం కల్పించాలన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు పీసా చట్టం కీలకమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మాతృభూమి గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు: సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News