ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా: దామోదర రాజనర్సింహ
ABN , Publish Date - May 26 , 2026 | 08:33 PM
ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎబోలా కేసులు లేవన్నారు.
హైదరాబాద్, మే 26: ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎబోలా కేసులు లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎబోలా లక్షణాలు ఉన్న వారిని గుర్తించలేదని పేర్కొన్నారు. ఎబోలాపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కట్టుదిట్టమైన స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
డీఆర్సీ, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్కానింగ్ చేస్తున్నామన్నారు. ఎయిర్పోర్ట్లో ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో 10 పడకల ఐసోలేషన్ వార్డు ఇప్పటికే సిద్ధంగా ఉంచామన్నారు. డాక్టర్ సునీల్ కుమార్ నోడల్ అధికారిగా నియామించినట్లు చెప్పారు. అనుమానితుల సాంపుల్స్ను మహారాష్ట్ర పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపామన్నారు.
విదేశాల నుంచి 58 మంది ప్రయాణికులు హైదరాబాద్కు చేరుకున్నారన్నారు. వారిలో ఎవరికీ ఎబోలా లక్షణాలు లేవని తెలిపారు. 58 మందిని 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో అధికారులు ఉంచారని గుర్తు చేశారు. 108 అంబులెన్స్లను 24 గంటలు సిద్ధంగా ఉంచామని చెప్పారు. అన్ని ప్రభుత్వాసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు.
ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని అధికారులను ఈ సందర్బంగా మంత్రి హెచ్చరించారు. ప్రజారోగ్య రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణిపై కాంగ్రెస్ అక్రమాలు మరిన్ని బయటపెడతా: హరీష్ రావు
వైఎస్ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి చురకలు
Read Latest TG News And Telugu News