Share News

ముగిసిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సిట్ విచారణ.. బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని వ్యాఖ్య

ABN , Publish Date - Jun 13 , 2026 | 07:44 PM

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది.

ముగిసిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సిట్ విచారణ.. బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని వ్యాఖ్య
MP Anil Kumar Yadav Questioned by SIT in Phone Tapping Case

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇవాళ (శనివారం) కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది. జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో దాదాపు అరగంట పాటు ఈ విచారణ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లు గుర్తించిన పోలీసులు, ఇందుకు సంబంధించిన కొన్ని సాంకేతిక ఆధారాలను ఆయన ముందు ఉంచి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఏ ఏ రోజుల్లో, ఏ సమయాల్లో ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారనే వివరాలను అధికారులు ఆయనకు వివరించినట్లు తెలిసింది.

ఇదే కేసులో అనిల్ కుమార్ యాదవ్ తండ్రి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ నిర్ధారించింది. అయితే, ఆయన వయోభారం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేరుగా వారి ఇంటికే వెళ్లి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.


గడప దాటకముందే పోలీసులు ఉండేవారు: ఎంపీ అనిల్ కుమార్

సిట్ విచారణ అనంతరం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత నీచ రాజకీయాలకు పాల్పడింది. నా ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించి నన్ను విచారణకు పిలిచారు. ఏ రోజు, ఏ టైమ్‌కు ట్యాపింగ్ జరిగిందో కొన్ని కీలక ఆధారాలను నా ముందు ఉంచి వివరాలు అడిగారు. అప్పట్లో మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము పార్టీ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసేవాళ్లం. అయితే, మేము ఏదైనా కార్యక్రమం తలపెట్టి ఇంటోంచి గడప దాటకముందే మా ఇంటి ముందు పోలీసులు వాలిపోయేవారు. మాకు అప్పట్లో అస్సలు అర్థం కాలేదు.. మేము ప్లాన్ చేసుకున్న విషయాలు పోలీసులకు ఎలా తెలుస్తున్నాయా అని ఆశ్చర్యపోయేవాళ్లం. ఇప్పుడు సిట్ ఆధారాలు చూపిస్తుంటే అసలు విషయం అర్థమైంది'. అని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

తనతో పాటు తన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని అనిల్ కుమార్ మండిపడ్డారు. ఆయన స్టేట్‌మెంట్ తీసుకోవడానికి అధికారులు ఇంటికి వస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎంతటివారైనా సరే చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్

Updated Date - Jun 13 , 2026 | 08:26 PM