నామినేషన్ తిరస్కరణ.. ఘాటుగా స్పందించిన మీనాక్షి
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:52 PM
తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్లో ఆమె మాట్లాడుతూ.. తాను మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తిని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 21: తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్లో ఆమె మాట్లాడుతూ.. తాను మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తిని తెలిపారు. తెలంగాణ నుంచి రాజీనామా చేయించినా తాను ఆ రాజ్యసభ స్థానాన్ని తాను తీసుకోనన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ లాంటి వ్యక్తుల కోసం వేరే రాష్ట్రాలు సీట్లు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. తన లాంటి వారి కోసం తెలంగాణ రాజ్యసభ స్థానాన్ని ఇస్తే.. అందుకు తాను ఒప్పుకోనని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడానికి చాలా కారణాలు
తన కేసుల అంశాన్ని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చారనేది పచ్చి అబద్ధమని మీనాక్షి నటరాజన్ తెలిపారు. బీజేపీనే కావాలని అబద్ధాలు సృష్టించిందంటూ మండిపడ్డారు. తాను ఎప్పుడైనా బాధితుల పక్షమేనని పేర్కొన్నారు. శ్రీలతకు కూడా తాను అండగా ఉన్నానని చెప్పారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరించారు. శ్రీలతపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఒక మహిళగా ఆమె వెర్షన్ విన్నామని తెలిపారు. ఆమె బాధను అర్ధం చేసుకొని డీసీసీ అధ్యక్షుడిని తొలగించామని చెప్పారు. కేసు ఉన్నంత మాత్రాన తన నామినేషన్ తిరస్కరణ కాలేదని స్పష్టం చేశారు.
అన్ని విషయాలు బయటకు వస్తాయి..
బీజేపీ, ఎన్నికల సంఘం పూర్తిగా కాంప్రమైజ్ అయ్యాయని.. అందువల్లే తన నామినేషన్ తిరస్కరించారని మీనాక్షి అన్నారు. కేవలం ఇది ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాదని తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. తన నామినేషన్ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు అబద్ధమని చెప్పారు. గణపతి పాలు తాగుతున్నాడని బీజేపీ అబద్ధాలను సృష్టించిందని సోదాహరణగా వివరించారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం అని.. అన్ని విషయాలు బయటకు వస్తాయని మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
బయట పడిన బీజేపీ బండారం..
పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ అనేక అబద్ధాలను సృష్టించిందని అన్నారు. రాజ్యసభ నామినేషన్ రిజక్ట్ చేసినందుకు తనకేం బాధ లేదన్నారు. తన నామినేషన్ తిరస్కరించడం వల్ల బీజేపీ బండారం బయట పడిందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. బీజేపీ నేతలను నామినేషన్ రూంలోని ఎలా అనుమతించారంటూ ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలన్నీ కాంప్రమైజ్ అయ్యాయని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధం లేని కేసుతో..
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అవకాశం లేదని బీజేపీకి అర్థమైంది. క్రాస్ ఓటింగ్ అవకాశం లేదని ఎన్నికల అధికారులతో ఆ పార్టీ నేతలు కుమ్మక్కు అయ్యారని విమర్శించారు. పరిమళ్ నత్వానీకి ఇచ్చిన అవకాశం తనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2023 రూల్ బుక్ అడ్డం పెట్టుకొని నత్వానికి నామినేషన్ కరెక్షన్ కోసం 24 గంటలు సమయం ఇచ్చారని.. కానీ తనకు 2026 రూల్ బుక్ ప్రకారం నామినేషన్ కరెక్షన్కు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. తనకు సంబంధం లేని కేసుతో నామినేషన్ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
లీగల్ నోటీస్.. క్రిమినల్ కేసు ఎలా అవుతుంది..
ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కేసులో తనకు లీగల్ నోటీస్ వచ్చిందని అన్నారు. లీగల్ నోటీస్.. క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నామినేషన్ పత్రంలో లీగల్ నోటీస్ అనే కాలమ్ లేదని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు. రాజ్యసభ ఎంపీగా గెలవాలంటే 58 మంది సభ్యుల అవసరం అవుతారన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటు ఇది అని స్పష్టం చేశారు. అయితే బీజేపీకి సంఖ్యాబలం లేకున్నా మూడో స్థానానికి నామినేషన్ వేశారని తెలిపారు. మూడో నామినేషన్ వేశారంటేనే బీజేపీ కుట్ర అర్ధమవుతోందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలోని వారంతా తనతో కలిసి నడిచారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
For More TG News And Telugu News