సిట్ విచారణకు కేటీఆర్.. తెలంగాణ భవన్కు తరలి వస్తున్న పార్టీ శ్రేణులు
ABN , Publish Date - Jan 23 , 2026 | 09:03 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్.. సిట్ అధికారుల విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పార్టీ కార్యాలయానికి తరలివస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 23: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ(శుక్రవారం) సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నార్సింగ్లోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో కలిసి ఉదయం 9.30గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమవుతారు.
ఆ తర్వాత 11.00 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు కేటీఆర్ హాజరవుతారు. అయితే సిట్ విచారణకు హాజరయ్యే ముందు విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడనున్నారు. మరోవైపు కేటీఆర్కు మద్దతుగా తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం తన నివాసంలో లీగల్ టీమ్తో కేటీఆర్ చర్చిస్తున్నారు.
సిట్ విచారణకు కేటీఆర్ హజరవుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీస్ స్టేషన్కి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావును ఇదే కేసులో సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట చోటు చేసుకున్న పరిణామాల కారణంగా.. టాస్క్ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్తోపాటు ఏఆర్ పోలీసులను రంగంలోకి దింపారు. అయితే సిట్ కార్యాలయంలోకి కేటీఆర్ తప్ప.. మరెవ్వరినీ అనుమతించరని తెలుస్తోంది. కేటీఆర్తోపాటు ఆయన న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బాసరకు పోటెత్తిన భక్తులు.. సరస్వతి అవతారంలో బెజవాడ దుర్గమ్మ
For More Telangana News and National News