Share News

కోఠి కాల్పుల కేసు.. యూపీకి హైదరాబాద్‌ పోలీసులు..

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:54 AM

కోఠి కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఘటన జరిగిన మరుసటి రోజే దుండగులు యూపీకి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు..

కోఠి కాల్పుల కేసు.. యూపీకి హైదరాబాద్‌ పోలీసులు..
Koti Shooting Case

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4: హైదరాబాద్‌లోని కోఠి ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్ వద్ద జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. గత నెల 31న ఉదయం నగదు జమ చేసేందుకు వచ్చిన రిన్షద్‌ అనే వ్యక్తిపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి ఆరు లక్షల నగదును దోచుకుని పారిపోయారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితులు ఆటోల్లో చక్కర్లు కొట్టి, చివరకు చాంద్రాయణగుట్ట, బార్కస్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. అయితే మరుసటి రోజే వారిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు పరారైనట్లు తెలుస్తోంది.


ఇద్దరు నిందితుల్లో ఒకరికి హైదరాబాద్‌లో ఇంతకుముందు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొద్ది రోజుల క్రితమే యూపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ నిందితులు.. బార్కస్ ప్రాంతంలో మకాం వేసినట్లు తెలుస్తోంది. నగరంలో ఉన్న స్థానికులు కొందరు ఈ దుండగులకు ఆశ్రయం ఇచ్చి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సహకారం అందించిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో పాతబస్తీ ప్రాంతంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


అతడు నిందితులకు షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరు లక్షల నగదుతో బ్యాగ్‌ను తీసుకుని హైదరాబాద్ నుంచి యూపీ వెళ్లిన నిందితులను పట్టుకోవడానికి.. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు యూపీలో కూడా గాలింపు చేపట్టారు. నాలుగు రోజులుగా నిరంతరం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్ బృందం, నిందితుడు పాత నేరస్థుడు కావడంతో యూపీ పోలీసుల సహకారంతో ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 12:16 PM