Share News

భారత్‌ను గ్లోబల్ మైనింగ్ లీడర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:29 PM

జియోపాలిటిక్స్, క్లైమేట్ మార్పు, ఆర్థిక భద్రతలో మినరల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మినరల్స్ కీలకమని చెప్పుకొచ్చారు.

భారత్‌ను గ్లోబల్ మైనింగ్ లీడర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: కిషన్ రెడ్డి
Kishan Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యం పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం హెచ్‌ఐసీపీలో భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2వ విడత ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ వేలం, 7వ విడత క్రిటికల్ & స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ వేలం కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జియోపాలిటిక్స్, క్లైమేట్ మార్పు, ఆర్థిక భద్రతలో ఈ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మినరల్స్ కీలకమని చెప్పుకొచ్చారు. మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.


ఇప్పటివరకు 46 బ్లాక్స్ వేలం విజయవంతంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 7వ విడతలో 19 బ్లాక్స్‌ల వేలం ప్రారంభమైందన్నారు. మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ మొదటి విడత ప్రారంభమైందని.. త్వరలోనే 11 బ్లాక్స్‌లకు రెండో విడత లైసెన్స్ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో 2 వెనేడియం, టైటానియం బ్లాక్స్ సిద్ధం చేసినట్లు మంత్రి ప్రకటించారు. మైనింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడం కోసం చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రాలు స్వతంత్రంగా వేలం నిర్వహించే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.


పర్యావరణ అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, 24 మినరల్స్‌పై కస్టమ్స్ డ్యూటీ రద్దు చేయడం, త్వరగా ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. స్క్రాప్ నుంచి మినరల్స్ రీసైక్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. విదేశాల్లో (ఆస్ట్రేలియా, అర్జెంటీనా) మైనింగ్ ప్రయత్నాలు చేపట్టామని తెలిపారు. రక్షణ రంగం, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs), గ్రీన్ ఎనర్జీకి క్రిటికల్ మినరల్స్ కీలకమని.. ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత్‌ను గ్లోబల్ మైనింగ్ లీడర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. 23 మంది సేఫ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 12:41 PM