జవహర్నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసు.. ప్రధాన నిందితుల అరెస్ట్
ABN , Publish Date - May 15 , 2026 | 04:34 PM
జవహర్నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మమత, ఆమె భర్త రమేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, మే 15: జవహర్నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మమత అలియాస్ మీనా కడాయత్, ఆమె భర్త రమేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ సరిహద్దుల్లో ఈ దంపతులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన రోజు యజమాని ద్విచక్ర వాహనాన్ని తీసుకుని దుండగులు పరారయ్యారు.
ఆ బైక్ను యాప్రాల్లోని పెట్రోల్ బంకు వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏజెంట్ భీమ్ను పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితులను రేపటిలోగా హైదరాబాద్కు తరలించనున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో మిగిలిన నిందితులు నేపాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ దంపతులను బంధించి.. నేపాలీ ముఠా దోపీడీకి పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు 75 తులాల బంగారం, 20 కిలోల వెండితో దుండగులు పరారయ్యారు. ఈ దోపిడీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నా దేశం.. నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర
గదిలో రక్తపు మరకలు.. సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి
Read Latest Telangana News And Telugu News